మనోడు తగ్గాడు..మరి పగోడు తగ్గుతాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న `రాజాసాబ్` ఎట్టకేలకు రిలీజ్ తేదీగా జనవరి 9 లాక్ చేసిన సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 30 Sept 2025 9:43 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న `రాజాసాబ్` ఎట్టకేలకు రిలీజ్ తేదీగా జనవరి 9 లాక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న చిత్రమిది. అయితే ఇదే తేదీన దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న `జన నాయగన్` కూడా రిలీజ్ అవుతుంది. దీంతో రెండు సినిమాల మధ్య తీవ్రమైన పోటీ తప్పదు. బాక్సాఫీస్ వద్ద నువ్వా? నేనా? అన్న రేంజ్ టఫ్ ఫైట్ నడుస్తుంది. అభిమానుల మధ్య వైరాలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. థియేటర్ల పరంగానూ కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం లేకపోలేదు.
ఈ నేపథ్యంలో రాజాసాబ్ నిర్మాతలు ఇవన్నీ ఆలోచించి తమిళనాడు వరకూ రిలీజ్ ను ఒక రోజు వాయిదా వేసారు. జనవరి 10న తమిళనాడులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళనాడులో రాజాసాబ్..జన నాయగన్ మధ్య పోటీకి ఆస్కారం తక్కువ ఉంటుంది. మరి ప్రభాస్ తగ్గిన నేపథ్యంలో విజయ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో తగ్గుతాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మనోడు తగ్గిన నేపథ్యంలో పగోడు కూడా తెలుగు రాష్ట్రాల్లో తన చిత్రాన్ని జనవరి 10కి వాయిదా వేసుకుంటే హీరోలిద్దరు బ్యాలెన్స్ అవుతారు.
మరి ఈ నిర్ణయం తీసుకోవాల్సింది జన నాయగన్ నిర్మాతలు..హీరో. రిలీజ్ కు ఇంకా పది రోజులు సమయం ఉన్న నేపథ్యంలో సానుకూల నిర్ణయాలు వెలువడతాయని డార్లింగ్ అభిమానులు ఆశీస్తున్నారు. మరేం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పటి వరకూ ప్రభాస్-విజయ్ సినిమా రిలీజ్ మధ్య ఎలాంటి క్లాష్ రాలేదు. ఒకే సీజన్ లో రిలీజ్ అయినా ఒకరోజు అటు ఇటుగా రిలీజ్ అయ్యాయి. తొలిసారి ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో క్లాష్ రావడంతో విషయం సంచలనంగా మారింది.
ఇప్పటికే విజయ్ `వారసుడు` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. పరుచూరి బ్రదర్స్ `వారసుడు`లో దొర్లిన తప్పిదాలును చెప్పే ప్రయత్నం చేసారు. కథ, కథనాల పైరంగా ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే? మంచి ఫలితాలు వచ్చేవని అభిప్రాయ పడ్డారు.
