పాపం స్వామీజీ ముందు నటి కన్నీటిపర్యంతం
నటి పూనమ్ పాండే సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉంటూ నిరంతరం నెటిజనుల్లో హాట్ టాపిగ్గా మారుతుంది.
By: Sivaji Kontham | 26 Feb 2026 9:07 AM ISTనటి పూనమ్ పాండే ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ సత్సంగంలో పాల్గొని కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే...
నటి పూనమ్ పాండే సోషల్ మీడియాల్లో స్పీడ్ గా ఉంటూ నిరంతరం నెటిజనుల్లో హాట్ టాపిగ్గా మారుతుంది. ఈ భామ ఇటీవల మధుర, బృందావనంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ప్రవచనాలు విన్నారు.
సత్సంగం జరుగుతుండగా పూనమ్ పాండే సాధారణ భక్తురాలిలా నేలపై కూర్చుని, మహారాజ్ మాటలకు ప్రభావితమై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలో ఆమె చాలా సాదాసీదాగా ఎటువంటి మేకప్ లేకుండా పసుపు రంగు దుస్తుల్లో కనిపించారు. కన్నీటిపర్యంతం అయిన అనంతరం పూనమ్ మాట్లాడుతూ..మహారాజ్ జీ మాట్లాడుతుంటే దైవమే స్వయంగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన ప్రవచనాలు నా జీవితంలో ప్రశాంతతను నింపాయి! అని పేర్కొన్నారు.
పూనమ్ పాండే గతంలో చేసిన కొన్ని డ్రామాల (ఫేక్ డెత్ వంటివి) కారణంగా కొందరు నెటిజన్లు దీన్ని విమర్శిస్తుండగా, మరికొందరు ఆమెలోని మార్పును అభినందిస్తున్నారు. అయితే ఎవరైనా నిజాయితీగా ఉండటం, స్వచ్ఛతతో జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం.
ఇటీవల పూనమ్ పాండే తరహాలో స్వామీజీల ప్రవచనాలు వింటున్న ఇతర కథానాయికల వివరాల్లోకి వెళితే..
అనుష్క శర్మ రెగ్యులర్ గా ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని రెగ్యులర్ గా సందర్శిస్తున్నారు. బృందావనంలోని ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమాన్ని అనుష్క తన భర్తతో కలిసి పలుమార్లు సందర్శించారు. ఇటీవలే (జనవరి 2026లో) తన పిల్లలతో కలిసి వెళ్లి స్వామీజీ ప్రవచనాలు విన్నారు. తనకు `ప్రేమ-భక్తి`ని ప్రసాదించమని ఆమె మహారాజ్ను కోరిన వీడియో వైరల్ అయ్యింది.
కత్రినా కైఫ్ కూడా ఇటీవలి కాలంలో తన అత్తగారితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ప్రయాగ్రాజ్లో జరిగిన మహా కుంభమేళాలో పాల్గొన్న కత్రినా, అక్కడ స్వామి చిదానంద్ సరస్వతి, సాధ్వీ భగవతి సరస్వతిలను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
బాలీవుడ్ నటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత అయిన ఇషికా తనేజా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు.ఆమె 2025లో జరిగిన మహా కుంభమేళాలో శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి వద్ద గురు దీక్ష తీసుకున్నారు. ఇషికా నటనను వదిలి పూర్తిస్థాయిలో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లినట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. వెటరన్ నటి- రాజకీయ నాయకురాలు హేమ మాలిని కూడా ఆధ్యాత్మికతలో చాలా చురుకుగా ఉంటారు. బృందావనానికి వెళ్ళిన ప్రతిసారి ఆమె ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లి ఆయన ప్రవచనాలు వింటూ ఆశీస్సులు పొందుతుంటారు. సారా అలీ ఖాన్ ప్రతి ఏడాది తన బిజీ షెడ్యూల్ నుండి విరామం తీసుకుని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శిల్పా శెట్టి -ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ప్రేమానంద్ జీ మహారాజ్ అనుచరులుగా ఉన్నారు. జీవితంలో మానసిక ప్రశాంతత కోసం వారు బృందావనంలోని ఆశ్రమానికి వెళ్లి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం పొందుతుంటారు.
గ్లామర్ ప్రపంచంలో ఉండే ఒత్తిడిని అధిగమించడానికి, మానసిక ప్రశాంతత కోసం ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు భక్తి యోగం, సత్సంగాల వైపు మళ్లుతున్నారు. వీరిలో కొందరు కేవలం దర్శనం కోసం వెళితే, మరికొందరు ఏకంగా సినీ కెరీర్కే స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నారు.
