పవన్ అప్పుడే రిలీవ్ అయిపోతున్నారా?
`ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి పవన్ కళ్యాణ్ రిలీవ్ కి సమయం ఆసన్నమైందా? మరో వారంలో తన పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది.
By: Srikanth Kontham | 8 Sept 2025 4:33 PM IST`ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి పవన్ కళ్యాణ్ రిలీవ్ కి సమయం ఆసన్నమైందా? మరో వారంలో తన పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. `హరిహరవీరమల్లు`, `ఓజీ`ల అనంతరం పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. పవన్ జాయిన్ అయిన నాటి నుంచి హరీష్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నారు. షెడ్యూల్స్ ఎక్కడా ఎలాంటి వాయిదాలు వేయకుండా ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా సెట్స్ కు ఎలాంటి ఢుమ్మా లేకుండా హాజరవుతున్నారు.
పాట చిత్రీకరణలో పీకే:
దీంతో హరీష్ కి పని మరింత సులభమైంది. పవన్ రావడమే ఆలస్యం ఆయన సమయం వృద్ధా చేయకుండా షూటింగ్ చేసి పంపిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పోర్షన్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. మరో వారంలో తన పోర్షన్ షూటింగ్ ముగించుకుని పవన్ రిలీవ్ అయిపోతారని సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై ఓ పాట చిత్రీకరణ జరుపుతున్నారు. ఇది వారం రోజుల పాటు కొనసాగుతుంది. అనంతరం పవన్ పై కొన్ని పెండింగ్ సన్నివేశాలు పూర్తి చేయనున్నారు.
అక్టోబర్ చివరికి కంప్లీట్:
దీంతో పవన్ పోర్షన్ కి సంబంధించి చిత్రీకరణ పూర్తయినట్లే. అటుపై ఇతర ప్రధాన తారాగణంపై హరీష్ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. వాళ్లకు సంబంధించిన షూటింగ్ అంతా నెల రోజుల్లోనే చుట్టేయ నున్నారు. ఈనేపథ్యంలో చిత్రీకరణ మొత్తం అక్టోబర్ చివరకల్లా పూర్తవుతుందని సమాచారం. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. ఇక్కడ పెద్దగా సమయం పట్టదు. హరీష్ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ అన్నది రెండు నెలల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో `ఉస్తాద్ భగత్ సింగ్` వచ్చే ఏడాది ప్రధమార్ధంలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
మొదలు ఆలస్యమైనా ముగింపు వేగంగా:
వీరమల్లు, ఓజీ షూటింగ్ లు పూర్తి చేయడానికి సమయం పట్టినా? ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం వేగంగా పూర్తవ్వడం విశేషం. ఈ విషయంలో హరీష్ శంకర్ లక్కీ. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ మొదలైన నాటి నుంచి సమయం వృద్దా కాలేదు. పట్టాలెక్కడం ఆలస్యమైనా? షూటింగ్ మొదలైన నాటి నుంచి విరామం లేకుండా పని చేయడంతో అంతే వేగంగా ముగింపు దశకు చేరుకుంది. ఇందులో పవన్ కు జోడీగా రాశీఖన్నా, శ్రీలీలు నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
