సింహం సరికొత్త గర్జనకు ముహూర్తం!
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇంత వరకూ పట్టాలెక్కలేదు.
By: Srikanth Kontham | 16 Nov 2025 10:36 AM ISTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఇంత వరకూ పట్టాలెక్కలేదు. `అఖండ2` చిత్రీకరణ పూర్తయిన బాలయ్య వేర్వేరు పనుల్లో బిజీగా ఉండటంతో లాంచింగ్ ఆలస్యమైంది. గత నెలలోనే లాంచింగ్ ప్లాన్ చేసారు. కానీ వీలు పడలేదు.ఈ నేపథ్యంలో ఈనెలఖరున పూజాకార్యక్రమాలతో ప్రారంభించ డానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి కొంత మంది ప్రముఖులు పాల్గొంటారని సమాచారం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.
పవన్ మరోసారి రంగంలోకి:
ఆయనే ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టనున్నారుట. ఇదే నిజమైతే బాలయ్య-పవన్ అభిమానులకు బిగ్ ట్రీట్ అవుతుంది. ఇంత వరకూ బాలయ్య నటించిన ఏ సినిమాకు పవన్ క్లాప్ కొట్టలేదు. ఆ సందర్భంగా కూడా ఏ సినిమాకు రాలేదు. ప్రస్తుతం పవన్ కూటమి లో భాగస్వామ్యం కావడంతో నందమూరి కుటుంబంతో మంచి సాన్నిహిత్యం కూడా కొనసాగుతుంది. మరో 15 ఏళ్ల పాటు ఆ పార్టీతోనే తన ప్రయాణం కూడా ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో? నందమూరి ఫ్యామిలీతో పవన్ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓ పాత్రలో రాజుగా:
ఈ క్రమంలో ఆ కుటుంబం కూడా పవన్ కు అంతే ప్రాధాన్యత ఇస్తోంది. వృత్తి, వ్యక్తిగత విషయాల్లోనూ పవన్ ని భాగ స్వామ్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాలయ్య తాజా సినిమాకు పీకే క్లాప్ ఇస్తే అది వేరే లెవల్లో ఉంటుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంత? అన్నది అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ క్లారిటీ రాదు. అలాగే సినిమా స్టోరీ విషయం కూడా లీకైంది. చరిత్ర-వర్తమానం అంశాలు మేళవింపుతో యాక్షన్ థ్రిల్లర్ గా మలుస్తున్నారుట. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారుట. ఓ పాత్రలో రాజుగా అలరించనున్నారుట.
మరో నటిగా తెలుగు హీరోయిన్:
మరో పాత్రకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఓ హీరోయిన్ గా నయనతార ఎంపికైనట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఆ విషయం మరో రెండు..మూడు రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. మరో నాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని దర్శకుని సన్నిహితుల నుంచి తెలిసింది. ఆ పాత్ర కోసం తెలుగు నటిని తీసుకోవాలనుకుంటున్నారుట. మరి ఆ ఛాన్స్ ఏ బ్యూటీకి దక్కుతుందో చూడాలి. ఇప్పటికే బాలయ్య-గోపీచంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
