#NTRNeel : రాజమౌళి దారిలోనే ప్రశాంత్ నీల్...?
ఎన్టీఆర్ అభిమానులతో పాటు, పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ #NTRNeel.
By: Ramesh Palla | 22 Nov 2025 1:00 PM ISTఎన్టీఆర్ అభిమానులతో పాటు, పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ #NTRNeel. ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల ఎక్కువ రోజులు ఆగి పోయింది. ఆ సమయంలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఊహించుకుని, సినిమా మొత్తానికే ఆగి పోయింది అంటూ ప్రచారం చేశారు. కానీ అసలు విషయం ఏంటంటే సినిమా షూటింగ్ కు ప్రశాంత్ నీల్ చిన్న బ్రేక్ మాత్రమే ఇచ్చాడు, ఆయన ప్రస్తుతం సినిమా పనిలోనే ఉన్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది అంటూ స్వయంగా చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అధికారిక సమాచారం అందుతోంది. దాంతో ఎన్టీఆర్, నీల్ మధ్య విభేదాలు అంటూ వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని తేలిపోయింది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్...
ప్రశాంత్ నీల్ గత చిత్రాలు కేజీఎఫ్, సలార్లను చూస్తే ఖచ్చితంగా యాక్షన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూడటం మనం గమనించవచ్చు. యాక్షన్ సన్నివేశాల కోసం ఈ సినిమాను ఎక్కువగా ప్రేక్షకులు చూడాలి అనుకుంటారు. అందుకే సలార్ రేంజ్ యాక్షన్ సీన్స్ ను ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ఆఫ్రికాలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ మీడియా సర్కిల్స్ నుంచి ఈ సమాచారం అందుతోంది. ప్రశాంత్ నీల్ గత కొన్ని రోజులుగా అదే పనిలో ఉన్నాడని, ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కు సంబంధించిన విషయాలను ఆయన చర్చించడంలో తలమునకలై ఉన్నాడు అంటూ కన్నడ మీడియా ప్రముఖంగా కథనాలు రాసింది.
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి షూటింగ్..
డ్రాగన్ సినిమా కోసం ఒక భారీ ఛేజింగ్ అడ్వంచర్ యాక్షన్ ఎపిసోడ్ ను ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరించేందుకు గాను ప్రశాంత్ నీల్ లొకేషన్స్ ను స్పాట్ చేశాడని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఆఫ్రికాకి ప్రశాంత్ నీల్ టీం వెళ్లిందని కూడా తెలుస్తోంది. అక్కడ అడవుల్లో యాక్షన్ సన్నివేశాలకు మంచి స్కోప్ ఉంటుందని, అందుకే ప్రశాంత్ నీల్ అక్కడ ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి సైతం వారణాసి సినిమా కోసం ఆఫ్రికాను యాక్షన్ సీన్స్ కోసం ఎంపిక చేసుకున్న విషయం తెల్సిందే. మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా రూపొందుతున్న యాక్షన్ అడ్వంచర్ మూవీలోని పలు యాక్షన్ సీన్స్ ను ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయని మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. రాజమౌళి సైతం అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక
రాజమౌళి తర్వాత ఇప్పుడు ప్రశాంత్ నీల్ సైతం తన సినిమా యాక్షన్ సీన్స్ కోసం ఆఫ్రికా అడవులను ఎంపిక చేసుకోవడం జరిగింది. సాధారణంగానే యాక్షన్ సీన్స్ కోసం ప్రశాంత్ నీల్ చాలా ఎక్కువ శ్రద్ద తీసుకుంటాడు. అలాంటిది కేజీఎఫ్, సలార్ వంటి సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు ఏ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేస్తాడో, హీరోను ఏ స్థాయిలో ఎలివేట్ చేస్తాడో ఊహించుకోవడానికి కూడా వీలు పడటం లేదు అంటూ ఎన్టీఆర్ అభిమానులతో పాటు రెగ్యులర్ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. 2026 సమ్మర్ కానుకగా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్లో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే షూటింగ్ మెజార్టీ శాతం పూర్తి అయింది. ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సూచన మేరకు ఎన్టీఆర్ ఇలా లుక్ మార్చాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఎన్టీఆర్ కి ఈ డ్రాగన్ మూవీ హిట్ అత్యంత అవసరం అని అభిమానులు భావిస్తున్నారు.
