జానపద గాయనిపై 500 కేసులు.. నేడు పోలీస్ స్టేషన్కు!
ప్రముఖ జానపద గాయని, ఆమె భర్తపై వివిధ పోలీస్ స్టేషన్లలో 500 కేసులు నమోదయ్యాయి. ఇందులో 318 కేసులు కేవలం ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి.
By: Sivaji Kontham | 4 Jan 2026 11:04 AM ISTప్రముఖ జానపద గాయని, ఆమె భర్తపై వివిధ పోలీస్ స్టేషన్లలో 500 కేసులు నమోదయ్యాయి. ఇందులో 318 కేసులు కేవలం ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేసారు. రెండోసారి నోటీస్ కి స్పందించిన సదరు గాయని నేడు భర్త సహా పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరవుతున్నారు. సదరు జానపద గాయని ఏం నేరం చేసారు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
చాలామందికి ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలోని చట్టాల గురించి తెలిసినది తక్కువ. ఏ దేశంలో అయినా ఆ దేశ మనుగడకు ప్రమాదం కలిగించేలా పౌరులు ప్రవర్తించడం నేరం. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం నేరం. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ కొన్నిసార్లు భావోద్వేగాలను అదుపు చేసుకోలేక నోరు జారే పరిస్థితి ఉంటుంది. అయితే ఉద్ధేశపూర్వకంగా భారతదేశాన్ని దెబ్బ కొట్టేలా వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఎలాంటి దురుద్ధేశం లేకుండా శత్రు దేశానికి అనుకూలమైన పనులు చేయరు కదా! అనే అభియోగాలు మోపుతారు.
పహల్గామ్ దాడిపై సోషల్ మీడియాలో వరుస పోస్టులతో రెచ్చిపోయిన జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ పై విచారణ మొదలైంది. మే 20న హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు వారణాసి కమిషనరేట్లోని మూడు జోన్లలోని 15 పోలీస్ స్టేషన్లలో రాథోడ్పై 500కు పైగా ఫిర్యాదులు సమర్పించారు. పోలీసు వర్గాల ప్రకారం లంకా పోలీస్ స్టేషన్లోనే 318 ఫిర్యాదులు అందాయి. పోలీసుల నోటీసులు అందుకున్న తర్వాత జానపద గాయని నేహా సింగ్ రాథోడ్ శనివారం రాత్రి హజరత్గంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులపై ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ విషయంలో దర్యాప్తు అధికారి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆమెతో పాటు ఆమె భర్త హిమాన్షు సింగ్ కూడా ఉన్నారు. సదరు గాయని ఆమె భర్త స్వచ్ఛందంగానే పోలీస్ స్టేషన్ కి వచ్చారని, అయితే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) ప్రకారం రాత్రిపూట మహిళను అరెస్టు చేయడానికి ఎలాంటి చట్టపరమైన నిబంధన లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అవసరమైతే వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పగటిపూట మళ్లీ పిలుస్తామని కూడా ఏసీపీ తెలిపారు.
వాంగ్మూలం సేకరించిన అనంతరం గాయని భర్త హిమాన్షు సింగ్ మీడియాతో మాట్లాడుతూ..రెండవ నోటీసు అందిన తర్వాత తాము సహకరించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ``మొదటి నోటీసు సుమారు 15 రోజుల క్రితం వచ్చింది.. కానీ ఆ సమయంలో నేహా రాథోడ్ అనారోగ్యంతో ఉంది. మేము పోలీసులకు తెలియజేసి కొంత సమయం కోరాము. రెండవ నోటీసులో మూడు రోజుల్లోగా హాజరు కావాలని కోరగా, ఈ రోజు విచారణకు సహకరించేందుకు వచ్చాము``అని తెలిపారు. రాథోడ్ వాంగ్మూలాన్ని అధికారికంగా నమోదు చేసిన తర్వాత చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ జంటపై కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? .. అభయ్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హజరత్గంజ్ పోలీస్ స్టేషన్లో రాథోడ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సదరు జానపద గాయని సోషల్ మీడియా పోస్టులు మత సామరస్యాన్ని దెబ్బతీసి, జాతీయ సమగ్రతను బలహీనపరుస్తాయని ఫిర్యాదుదారు ఆరోపించారు. రాథోడ్ వ్యాఖ్యలు పాకిస్థాన్లోని ప్లాట్ఫారమ్ సహా విస్తృతంగా షేర్ అయ్యాయని, భారతదేశాన్ని విమర్శించడానికి విదేశీ మీడియా వాటిని ఉపయోగిస్తోందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రాథోడ్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేసారు. దీనిపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించారు. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వంపై తీవ్రమైన భాషను ఉపయోగించారు. ఆ తర్వాత లక్నో, వారణాసిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. 15 రోజుల క్రితం పోలీసులు నోటీసులు పంపారు. ఇప్పుడు రెండో నోటీస్ తో విచారణ ప్రక్రియ మొదలైంది.
