ప్రమోషన్ భయంలో లేడీ సూపర్ స్టార్!
ఈ మార్పులో భాగంగానే తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `టాక్సిక్` చిత్రానికి సంబంధించిన లైవ్ ఈవెంట్కు నయన్ స్వయంగా హాజరై ఆశ్చర్యపరిచారు.
By: Srikanth Kontham | 10 Aug 2026 9:00 PM ISTలేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి నయనతార గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన నయన్ ఇండస్ట్రీలో విభిన్నమైన ట్రెండ్ను ఫాలో అయ్యేవారు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ప్రమోషన్ కార్యక్రమాలకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం అమ్మడి నైజం. అయితే కాలం మారుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నయనతార పద్ధతిని పూర్తిగా మార్చుకుంటున్నారు.
ఒకప్పుడు సినిమా ఎంత పెద్దదైనా? ఎలాంటి క్రేజీ ప్రాజెక్ట్ అయినా? నయనతార మాత్రం ప్రమోషన్లకు ఎప్పుడూ హాజరయ్యే వారు కాదు. రిలీజ్ పై నమ్మకంత్ఓ ప్రమోషనల్ ఈవెంట్లలో పాల్గొనకుండానే తన సినిమాలను విజయాల బాట పట్టించారు. కానీ ఇటీవలి కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తాజాగా `మన శంకరవరప్రసాద్ గారు` కోసం అమ్మడు నేరుగా కాకపోయినా ప్రత్యేకంగా ప్రమోషనల్ వీడియోలు చేసి చిత్ర యూనిట్కు తన వంతు సహకారం అందించారు. ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పించడంలో ఆ వీడియోలు కీలక పాత్ర పోషించాన్నది కాదనలేని నిజం.
ఈ మార్పులో భాగంగానే తాజాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న `టాక్సిక్` చిత్రానికి సంబంధించిన లైవ్ ఈవెంట్కు నయన్ స్వయంగా హాజరై ఆశ్చర్యపరిచారు. యష్ హీరోగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్ర వేడుకలో నయనతార పాల్గొనడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు ప్రమోషన్లకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడిలా నేరుగా లైవ్ ఈవెంట్లలో కనిపించడంతో అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నయన్ లో వస్తోన్న సానుకూల మార్పు సినిమాకు మరింత హైప్ను తీసుకొస్తుంది. దీంతో ఇతర సినిమాల విషయంలో కూడా నయనతార ఇంతే పాజిటివ్ గా ఉంటుందని అభిమానులు ఆశీస్తున్నారు.
ఇకపై తాను నటించే ప్రతి సినిమా ప్రచార కార్యక్రమాలకు తప్పకుండా హాజరవుతుందని.. ఆరకంగా ప్లాన్ చేసు కుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితులే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంత పెద్ద స్టార్ నటి అయినా? సినిమాను ప్రేక్షకులకు సరిగ్గా రీచ్ చేయకపోతే బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. మారిన బిజినెస్ సమీకరణాల నేపథ్యంలో సినిమా చేయడం మాత్రమే కాకుండా దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నటీనటులపై కూడా ఉందనేది అంతే వాసత్వం.
ఒకవేళ నటీనటులు ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉంటే, నిర్మాతలు కూడా భవిష్యత్తులో అలాంటి వారిని లైట్ తీసుకునే ప్రమాదకరమైన పరిస్థితికి పరిశ్రమ వచ్చేసింది. సోషల్ మీడియా హవా పెరిగిన రోజుల్లో ప్రమోషన్లు లేకపోతే సినిమాపై ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడటం కష్టమవుతోంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన కొందరు తారలు నిర్మాతల ఇబ్బందిని అర్థం చేసుకుంటూ పంథాను మార్చుకుంటున్నారు. ఇది నిజంగా ప్రశంసనీయం. నయనతార సుదీర్ఘ కెరీర్లో ఎన్నడు లేని విధంగా ప్రమోషన్ల కోసం ముందుకు రావడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
