Begin typing your search above and press return to search.

మైత్రీ చుట్టూ ఎందుకింత చర్చ? అసలు రీజనేంటి?

టాలీవుడ్‌ లో థియేట్రికల్‌ వ్యవస్థ, ఎగ్జిబిటర్ల డిమాండ్లు, పర్సంటేజ్ విధానం వంటి అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

By:  M Prashanth   |   14 May 2026 10:42 PM IST
మైత్రీ చుట్టూ ఎందుకింత చర్చ? అసలు రీజనేంటి?
X

టాలీవుడ్‌ లో థియేట్రికల్‌ వ్యవస్థ, ఎగ్జిబిటర్ల డిమాండ్లు, పర్సంటేజ్ విధానం వంటి అంశాలపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేరు వరుసగా వివాదాల మధ్య వినిపించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో తెరకెక్కుతున్న పలు భారీ ప్రాజెక్టులు ఆ సంస్థ చేతుల్లో ఉండటంతో, ప్రతి చిన్న విషయం పెద్ద చర్చకు దారితీస్తోంది.

ప్రస్తుతం రామ్‌ చరణ్ నటిస్తున్న పెద్ది, జూనియర్‌ ఎన్టీఆర్‌– ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో వస్తున్న డ్రాగన్, ప్రభాస్‌ నటిస్తున్న ఫౌజీ వంటి భారీ చిత్రాలను మైత్రీ నిర్మిస్తోంది. వీటితో పాటు మహేష్ బాబు వారణాసి, అల్లు అర్జున్ రాకా వంటి సినిమాల తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం మైత్రీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పలువురు స్టార్ హీరోలతో కూడా ఆ సంస్థ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుందని సమాచారం.

ఆ భారీ లైనప్ కారణంగా ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్‌ లో క్రేజీ లైనప్ ఉన్న బ్యానర్లలో ఒకటిగా మారింది. అయితే ఇదే అంశం ఇప్పుడు వివాదాలకు కూడా సెంటర్ పాయింట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదలల ముందు సినీ పరిశ్రమలో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వాతావరణం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే చర్చ మొదలైంది.

ఇటీవల థియేటర్ల పర్సంటేజీ వ్యవస్థపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య విభేదాలు బయటపడటం మరింత హీట్ పెంచింది. పెద్ద బడ్జెట్ సినిమాల విడుదలల ముందు ఇలాంటి చర్చలు రావడం వల్ల మార్కెట్‌ లో అనవసరమైన భయం ఏర్పడుతుందని కొందరు నిర్మాతలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితులను ఇప్పుడు మైత్రీ బ్యానర్ సినిమాలతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

ఇండస్ట్రీలో ఒక బ్యానర్ వద్ద వరుసగా భారీ సినిమాలు ఉండటం కామన్ గానే ఒత్తిడిని పెంచుతుంది. ఒక సినిమా విడుదలలో చిన్న సమస్య వచ్చినా దాని ప్రభావం కోట్ల రూపాయల స్థాయిలో ఉండొచ్చు. థియేటర్ల ఆక్యుపెన్సీ, రెవెన్యూ షేర్లు, అడ్వాన్స్ బుకింగ్స్, రిలీజ్ డేట్లు వంటి అంశాలు పెద్ద సినిమాల విషయంలో చాలా కీలకంగా మారతాయి. అందుకే ఇప్పుడు మైత్రీ చుట్టూ జరుగుతున్న ప్రతి పరిణామం పెద్దగా కనిపిస్తోంది.

మరోవైపు, టాలీవుడ్‌ లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితుల కారణంగానే ఒత్తిడి పెరిగిందని చెప్పేవారు కూడా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల బడ్జెట్లు పెరగడం, థియేట్రికల్ రికవరీపై ఆధారపడటం, ఓటీటీ మార్కెట్‌ లో మార్పులు రావడం వంటి కారణాలతో నిర్మాతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

ఈ నేపథ్యంలో పెద్ద బ్యానర్ల పై ఫోకస్ ఎక్కువగా ఉండటం సహజమేనని చెప్పాలి. ఏదేమైనా ప్రస్తుతం టాలీవుడ్‌ లో జరుగుతున్న బిజినెస్ చర్చల మధ్య మైత్రీ మూవీ మేకర్స్ పేరు ఎక్కువగా వినిపించడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఆ వివాదాలు తాత్కాలికమా లేక ఫ్యూచర్ లో బిజినెస్ పై ఎఫెక్ట్ చూపిస్తాయా అన్నది మాత్రం త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.