అయ్యో.. భలే సినిమాను మిస్ అయ్యామే!
స్టార్ కాస్ట్తో పని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమా జనాల్లో మంచి ఆధరణ సొంతం చేసుకుంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.
By: Ramesh Palla | 24 Aug 2025 2:30 PM ISTస్టార్ కాస్ట్తో పని లేకుండా కంటెంట్ ఉంటే చాలు సినిమా జనాల్లో మంచి ఆధరణ సొంతం చేసుకుంటుందని మరోసారి నిరూపితం అయ్యింది. తమిళ్ మూవీ 'మారేసన్' ఓటీటీలో అద్భుతమైన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంటూ అత్యధిక వ్యూస్ను సొంతం చేసుకుంటుంది. ఈ ఏడాది జులై 25న థియేట్రికల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఇటీవల ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. సుధీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, వడివేలు ముఖ్య పాత్రల్లో నటించారు. తమిళ్లో ఈయనకు పెద్ద హీరోగా గుర్తింపు లేదు. అయినా కూడా ఫహద్, వడివేలు సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అయితే థియేట్రికల్ రిలీజ్లో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ను సినిమా రాబట్టలేక పోయింది.
ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రలో..
థియేట్రికల్ రిలీజ్లో పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్గా ఆడలేదు. కానీ ఓటీటీలో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విభిన్నమైన ఈ కాన్సెప్ట్ మూవీని జనాలు తెగ ఆధరిస్తూ ఉన్నారు. ఫహద్ ఫాసిల్, వడివేలు కాంబోలో ఉన్న సన్నివేశాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమాను రెండు మూడు సార్లు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫహద్ అద్భుతమైన నటనతో పాటు, వడివేలును చాలా కొత్తగా దర్శకుడు సుధీష్ శంకర్ చూపించిన నేపథ్యంలో మారేసన్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో ఓటీటీలో అత్యధిక ఆధరణ దక్కించుకుంటున్న సినిమాగా ఈ సినిమా నిలిచింది.
మారేసన్ కి ఓటీటీలో మంచి స్పందన
ఫహద్ ఫాసిల్, వడివేలు పోటీ పడి మరీ నటించినట్లుగా ఉంది. అంతే కాకుండా ఇందులో చూపించిన సున్నితమైన కథ, స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. ఓటీటీలో ఈ సినిమాను చూసిన తర్వాత చాలా మంది అయ్యో... ఇంత మంచి సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యాం అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. మారేసన్ సినిమాను ఎందుకు జనాలు థియేటర్లో ఆధరించలేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సినిమా థియేటర్ రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేయక పోవడం వల్ల థియేట్రికల్ రిలీజ్లో ఎక్కవ వసూళ్లు సాధించలేదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా విషయంలో అన్యాయం జరిగిందని కొందరు అంటున్నారు.
వడివేలు విభిన్నమైన పాత్రలో..
అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రలో వడివేలు చాలా బాగా నటించాడు. అతడిని ఇలాంటి ఒక పాత్రలో చూస్తామని ఏ ఒక్కరూ ఊహించలేదు. తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అయిన తర్వాత ఈ సినిమాను చూసి వావ్ అంటున్నారు. ఇలాంటి ఒక గొప్ప సినిమాను తీసిన దర్శకుడు ఎవరా అంటూ మాట్లాడుకుంటున్నారు. వడివేలు ఇలాంటి ఒక పాత్రలో చూపించడం ద్వారా దర్శకుడు చాలా పెద్ద ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం నూటికి నూరు శాతం సక్సెస్ అయింది. అయితే ఇలాంటి సినిమాలు ఓటీటీలో కంటే థియేట్రికల్ రిలీజ్ అయిన సమయంలో మంచి విజయాన్ని సొంతం చేసుకుని, కలెక్షన్స్ రాబడితే అప్పుడు ఖచ్చితంగా మరిన్ని ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
