డైరెక్టర్ పై కేసు కట్టాల్సిందేనంటూ కార్మిక సంఘాల డిమాండ్!
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది.
By: Srikanth Kontham | 24 Jun 2026 11:02 AM IST`లవ్ అండ్ వార్` సెట్స్ లో కార్మికుడి మరణం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధఙంచి కుటుంబ సభ్యులను ఆదుకునే ప్రక్రియలో భాగంగా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ 40 లక్షలు పరిహారం చెల్లించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈఘటపై కార్మిక సంఘాల జోక్యంతో చట్టపరమైన పోరాటంగా మారుతోంది.కార్పెంటర్గా పనిచేస్తున్న 42 ఏళ్ల చంద్రధారి సింగ్ యాదవ్ మరణం వెనుక అసలు ఏం జరిగిందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో భిన్నమైన కథనాలు ప్రచారంలోకి రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్లాల్ గుప్తా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు సంబంధిత నిర్మాణ సంస్థపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.అయితే ఈ మరణానికి గల కారణాలపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
అంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సదరు కార్మికుడు విద్యుత్ ఘాతానికి గురై మరణించాడని పేర్కొనగా.. అసావా మాత్రం ఆ వాదనను తోసిపుచ్చింది. సెట్ నిర్మాణం పైకప్పు కుప్ప కూలడం వల్లే యాదవ్ ప్రాణాలు కోల్పోయాడని ఘటనలో మరికొందరు కార్మికులు కూడా గాయపడ్డారని ఐసివా ఆరోపిస్తోంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్తో పాటు, మరణించిన కార్మికుడి భార్య, ఇద్దరు మైనర్ కుమార్తెల భవిష్యత్తు కోసం కోటి రూపాయల పరిహారం చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
అలాగే సదరు వితంతువుకు ఉపాధి కల్పించాలని కోరింది. ప్రమాదం జరిగిన లొకేషన్లో భద్రతా తనిఖీలు పూర్తి చేసి, అధికారులు ధృవీకరించే వరకు అక్కడ అన్ని రకాల షూటింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. భన్సాలీ చిత్రాల సెట్స్పై ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాదని కార్మిక సంఘం గుర్తు చేసింది. గతంలో `దేవదాస్`, `పద్మావత్` సినిమాల నిర్మాణ సమయంలోనూ కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలను ప్రస్తావించారు.
భారీ తారాగణంతో బ్రహ్మాండమైన సెట్లతో సినిమాలను నిర్మించే క్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేసే కార్మికుల ప్రాణాల రక్షణకు సరైన పర్యవేక్షణ కరువైందనే ఆరోపణలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. మరి రెండు సంఘాల భిన్న వాదనల్లో ఎవరు? నిజం అన్నది తేలాల్సి ఉంది. ఈ ఘటన నేపథ్యంలో తాత్కాలికంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. సంజయ్ లీలా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్నారని..బయటకు రావడం లేదని మీడియాలో కథనాలొస్తున్నాయి.
