రన్టైమ్: నిడివి పెరిగినా ప్రేక్షకుల ఆదరణ!
వెండితెరపై సినిమా చూసే అనుభవంలో కాలక్రమేణా అనేక మార్పులు వస్తున్నాయి.
By: Srikanth Kontham | 17 Aug 2026 1:00 AM ISTవెండితెరపై సినిమా చూసే అనుభవంలో కాలక్రమేణా అనేక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలకు రెండున్నర గంటల నిడివి మాత్రమే ఐడియల్ రన్టైమ్గా ఉండేది. అంతకంటే ఎక్కువైతే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారనే అపనమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉండేది. కానీ ప్రస్తుతం ఆ లెక్కలన్నీ తలకిందులవుతున్నాయి. కథలో దమ్ముంటే, భావోద్వేగాలు పండుతుంటే నిడివి ఎంత ఉన్నా? ప్రేక్షకులు ఆస్వాదిస్తారనే నిజాన్ని ఇటీవలి కాలంలోని బాక్సాఫీస్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుత ట్రెండ్ను పరిశీలిస్తే `పుష్ప 2`, `యానిమల్`, `ఆర్ఆర్ఆర్` వంటి భారీ చిత్రాలు మూడు గంటల నిడివిని దాటినా బాక్సాఫీస్ వద్ద అసాధారణ విజయాలను నమోదు చేశాయి. రీసెంట్గా రిలీజ్ అయిన రణ్వీర్ సింగ్ `ధురంధర్` చిత్రం కూడా సుదీర్ఘమైన రన్టైమ్తో థియేటర్లలోకి వచ్చి అద్భుతమైన వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ విజయాపజయాల సరళి చూస్తే? ప్రేక్షకులకు నిడివితో పనిలేదని, బలమైన కంటెంట్ ఉంటే గంటల తరబడి థియేటర్లలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నారని రుజువువుతోంది.
ఈ కోవలోనే కన్నడ దర్శకురాలు గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ `టాక్సిక్` కూడా భారీ నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఏకంగా 3 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంతటి సుదీర్ఘ రన్టైమ్ ఉండటం ఆసక్తికరంగా మారినా? మేకర్స్ మాత్రం కంటెంట్పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు.
సినిమాలో ల్యాగ్ ఉందా లేదా అనేది నిడివిని బట్టి నిర్ణయించలేమని, కథ చెప్పే విధానం .. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటే మూడు గంటల సమయం కూడా నిమిషాల్లో గడిచిపోతుందని ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దర్శకులు తాము చెప్పాలనుకున్న భావోద్వేగాలను, పాత్రల లోతును ప్రేక్షకులకు పూర్తిగా అనుభూతి చెందించడానికి పెద్ద చిత్రాలకు అదనపు సమయం ఎంతో అవసరమవుతోంది. అందుకే కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు నిడివిని తగ్గించడానికి దర్శక నిర్మాతలు వెనుకాడటం లేదు.
మొత్తానికి సినిమాలో విషయం ఉంటే? రన్టైమ్ మ్యాటర్ కాదు అనే సరికొత్త సూత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్గా మారింది. ప్రేక్షకులకు విజువల్ వండర్తో పాటు బలమైన డ్రామాను అందించగలిగితే? వారు సినిమా నిడివిని సమస్యగా చూడరని భారీ చిత్రాల విజయం నిరూపిస్తోంది. రాబోయే రోజుల్లో పెద్ద బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలన్నీ ఇదే బాటలో నడిచే అవకాశం కనిపిస్తోంది.
ఈ పరిణామాలు దర్శకులకు మరింత స్వేచ్ఛను ఇస్తున్నాయి. కమర్షియల్ హంగుల కోసం కథను కుదించాల్సిన అవసరం లేకుండా ఊహాశక్తికి తగినట్లుగా పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించే వెసులుబాటును ఈ ట్రెండ్ కల్పిస్తోంది. ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా పరిపూర్ణ సినిమా అనుభూతిని కోరుకుంటున్నారనడానికి సుదీర్ఘ చిత్రాల భారీ విజయమే తిరుగులేని నిదర్శనంగా భావిస్తున్నారు.
