'మహావతార్' స్ఫూర్తితో 'కురుక్షేత్రం'
నరసింహస్వామి కథతో హోంబలే ఫిలింస్ నిర్మించిన `మహావతార్` అసాధారణ విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు `కురుక్షేత్రం` వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది
By: Sivaji Kontham | 12 Sept 2025 4:00 AM ISTభారతీయ సినీరంగంలో యానిమేటెడ్ సినిమాల విజృంభణ మొదలైంది. నరసింహస్వామి కథతో హోంబలే ఫిలింస్ నిర్మించిన `మహావతార్` అసాధారణ విజయం సాధించిన నేపథ్యంలో, ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు `కురుక్షేత్రం` వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. మహాభారతంలో అత్యంత కీలక ఘట్టంపై `కురుక్షేత్ర` పేరుతో యానిమేటెడ్ సిరీస్ ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తోంది నెట్ ఫ్లిక్స్. భారతీయ పురాణేతిహాసాలపై ఇప్పుడు విదేశీ దిగ్గజ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ గట్టి పట్టు పట్టడానికి సిద్ధమవుతోంది.
పురాణాల్లో `కురుక్షేత్ర యుద్ధం` అత్యంత భావోద్వేగాలకు సంబంధించిన కీలక ఘట్టం. అన్నదమ్ముల మధ్య యుద్ధ నేపథ్యంలో కథాంశం రక్తి కట్టించనుంది. ఈ గ్రేట్ వారియర్ ఎపిక్ డ్రామాలో `నైతిక యుద్ధం` కాన్సెప్టు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకునే కీలక అంశం కావడంతో, ప్రజల్లో సర్వత్రా ఈ యానిమేషన్ సిరీస్ క్యూరియాసిటీ పెంచనుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోని షేర్ చేస్తూ, ప్రాజెక్ట్ ని ప్రకటించింది. ``శంఖ్నాద్ కే సత్ ఆరంభ్ హోగా ధర్మ్ ఔర్ అధర్మ్ కా మహాయుధ్.. అక్టోబర్ 10న నెట్ఫ్లిక్స్లో మాత్రమే విడుదలయ్యే కురుక్షేత్రాన్ని చూడండి`` అని వ్యాఖ్యాను జోడించారు.
ఈ పౌరాణిక సిరీస్ గురించి నెట్ఫ్లిక్స్ ఇండియా సిరీస్ హెడ్ తాన్యా బామి మాట్లాడుతూ.. మహాభారతం ఎల్లప్పుడూ ఒక ఇతిహాసం కంటే ఎక్కువ. నావల్టీ ఉన్న కథలను తెరపై యానిమేలో చూపించడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇందులో పాత్రలు లోతైన అంశాలతో లేయర్డ్ గా ఆకట్టుకుంటాయి. నేటి తరానికి పురాణాలను పరిచయం చేయడానికి ఇది మంచి అవకాశం`` అని అన్నారు. ఈ యానిమేటెడ్ సిరీస్ ద్వారా 18 రోజుల కురుక్షేత్రాన్ని, యుద్ధంలో విభిన్న దృక్పథాల గురించి, నైతికత గురించి నేటితరం తెలుసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఈ ఇతిహాస కథను భారతీయ వినోద ప్రియులతో పాటు, ప్రపంచ ప్రేక్షకులకు దృశ్యపరంగా అద్భుతమైన కొత్త ఫార్మాట్లో అందుబాటులోకి తెస్తుంది.. అని తెలిపారు. దీనికి అలోక్ జైన్, అను సిక్కా, అజిత్ అంధారే నిర్మాతలు. ఈ సిరీస్ను ఉజాన్ గంగూలీ రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత గుల్జార్ పాటలను అందిస్తున్నారు.
యుద్ధంలో 18 మంది కీలక యోధుల దృక్పథాన్ని `కురుక్షేత్ర` ఎలివేట్ చేస్తుంది. అన్నదమ్ముల మధ్య అంతర్గత సంఘర్షణలు, వ్యక్తిగత కక్షలు, యుద్ధం వల్ల సోదరుల మధ్య భారీ నష్టాల గురించి ప్రపంచానికి ఆవిష్కరిస్తుంది. ఈ సిరీస్ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఒక్కొక్కటి తొమ్మిది ఎపిసోడ్లతో రక్తి కట్టించనుంది.
