కృతి శెట్టి పారితోషికం- బ్రాండ్ పబ్లిసిటీ ఆదాయం రేంజ్?
తాజాగా కృతి శెట్టి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ లూయీస్ వీట్టన్ ప్రమోషనల్ ఫోటోషూట్ను అభిమానులతో షేర్ చేసింది.
By: Sivaji Kontham | 24 Jun 2026 11:30 PM ISTటాలీవుడ్ లో `ఉప్పెన` చిత్రంతో ఓవర్నైట్ స్టార్గా మారిన బ్యూటీ కృతి శెట్టి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా వాణిజ్య ప్రకటనల (బ్రాండ్ ప్రమోషన్స్) ద్వారా భారీగా ఆర్జిస్తోంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ వరుస ఫోటోషూట్లతో పాటు క్రేజీ బ్రాండ్స్ ప్రమోషన్లను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కృతి శెట్టి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ఒక్కో యాడ్ కోసం ఎంత డిమాండ్ చేస్తోంది? లూయీస్ వీట్టన్ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఏడాది కాంట్రాక్ట్కు గానూ ఎంత పారితోషికం అందుకుంటుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
తాజాగా కృతి శెట్టి గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ లూయీస్ వీట్టన్ ప్రమోషనల్ ఫోటోషూట్ను అభిమానులతో షేర్ చేసింది. హైదరాబాద్లో జరిగిన లూయీస్ వీట్టన్ కారవాన్ ఈవెంట్లో పాల్గొన్న కృతి శెట్టి దానికి సంబంధించిన స్టైలిష్ ఫోటోలను షేర్ చేసింది. లగ్జరీ బ్రాండ్ల ప్రమోషన్స్కు కేరాఫ్గా మారుతున్న కృతి.. కేవలం ఫ్యాషన్ బ్రాండ్స్ మాత్రమే కాకుండా ప్రముఖ బ్యాంకింగ్ సర్వీస్ `మాస్టర్ కార్డ్ ఇండియా` వాణిజ్య ప్రకటనలో బాలీవుడ్ యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.
బ్రాండ్స్ ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తున్న కృతి శెట్టి, ప్రముఖ జువెలరీ సంస్థ `ఇంద్రియ జువెలర్స్` ప్రకటనలోనూ నటించి మెప్పించింది. అక్షయ తృతీయ సందర్భంగా సంప్రదాయబద్ధమైన టెంపుల్ గోల్డ్ జువెలరీ ధరించి చేసిన ఈ ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిన్నతనం నుండి తన కుటుంబంలో ఉన్న సాంప్రదాయాలు, గుడి సందర్శనల జ్ఞాపకాలను ఈ ప్రత్యేకమైన జువెలరీ కలెక్షన్ ప్రతిబింబిస్తోందని కృతి శెట్టి ఈ సందర్భంగా పేర్కొంది. బ్రాండ్స్ ని ఇన్ స్టాలో ప్రమోషన్స్ చేయడం కోసం ఒక్కో పోస్టుకు 2లక్షల వరకూ ఛార్జ్ చేస్తోందట. అలాగే ఒక్కో కాంట్రాక్టుకు 20లక్షల నుంచి 30లక్షల వరకూ అందుకుంటోందని సమాచారం. ఇక నటిగాను ఒక్కో సినిమాకి .. ప్రాజెక్ట్ స్థాయిని బట్టి కృతి శెట్టి సుమారు 50 లక్షల నుండి 1 కోటి వరకు పారితోషికం తీసుకుంటున్నారు. 2021లో భారీ విజయం సాధించిన తన తొలి చిత్రం `ఉప్పెన` కోసం ఈ యంగ్ బ్యూటీ 6లక్షల పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత తన రేంజ్ 50లక్షలకు పెరిగింది.
ఒకవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్లతో దూసుకుపోతున్న కృతి శెట్టి, మరోవైపు వైవిధ్యమైన పాత్రలతో నటిగానూ మెప్పిస్తోంది. తాజాగా దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబినేషన్లో కృతి నటించిన `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమాలో కృతి పోషించిన ధీమ అనే గ్లామర్ డాళ్ పాత్రకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాల్యంలో ఎదురైన కొన్ని చేదు అనుభవాల వల్ల ప్రేమ కోసం తపించే `ధీమ` లాంటి ఎమోషనల్ క్యారెక్టర్ను తాను వ్యక్తిగతంగా ఎంతో కనెక్ట్ అయి చేశానని, ప్రేమ అనేది ఎవరివద్దో సంపాదించుకునేది కాదని.. అది సహజంగా లభించేదనే సందేశం తనకు బాగా నచ్చిందని కృతి శెట్టి పేర్కొంది. కృతి నటించే తదుపరి సినిమాల వివరాలను త్వరలోనే వెల్లడించనుందిట.
