Begin typing your search above and press return to search.

కృష్ణ సంగీతం: యుగాలు మారినా చెరగని భక్తి తరంగాలు!

ప్రస్తుత తరం కళాకారులు శాస్త్రీయ, పౌరాణిక స్తోత్రాలను అంతర్జాతీయ స్థాయి సంగీత శైలులతో సమ్మిళితం చేసి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు.

By:  Srikanth Kontham   |   4 Sept 2026 2:47 PM IST
కృష్ణ సంగీతం: యుగాలు మారినా చెరగని భక్తి తరంగాలు!
X

నేడు కృష్ణ జన్మాష్టమి పర్వదినం వేళ భారతీయ సంగీత ప్రపంచంలో శ్రీకృష్ణుడి లీలలు, ఆయనపై రూపొందిన భక్తిగీతాలు ప్రాధాన్యాన్ని సంతరించుకోవ‌డం స‌హ‌జం. యుగాలు మారినా కృష్ణుడి బాల్యం, మైత్రి, ప్రేమ, త్యాగం, ఆత్మజ్ఞానాన్ని ప్రతిబింబించే పాటలు ఎప్పటికీ నిత్యనూతనంగానే నిలుస్తాయి. దేశంలో రకరకాల ప్రాంతాల్లో కృష్ణుడిని భిన్న రూపాల్లో ఆరాధించినట్లే సంగీత కళాకారులు కూడా తమదైన శైలిలో వేణుగోపాలుని కథలను స్వరబద్ధం చేస్తూ శ్రోతలను భక్తి పరవశంలో ముంచెత్తుతున్నారు. ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ పండిత్ భీమ్‌సేన్ జోషి, లతా మంగేష్కర్ సంయుక్తంగా ఆలపించిన సంప్రదాయ భక్తిగీతాలను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. తన‌ స్వంత రచనలు .. స్వరకల్పనల ద్వారా భగవంతుని లీలలను ప్రపంచానికి చాటడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

నారాయణుడి వివిధ అవతారాలు, ఆయన లీలల ఆధారంగా రూపొందే ప్రతి గీతం శ్రోతల మనస్సులలో కొత్త ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతుందని విశ్వసిస్తారు. సంగీత దర్శకుడు, గాయకుడు శంకర్ మహదేవన్ శ్రీకృష్ణుడి తత్వాన్ని వర్ణించడానికి సంగీతంలో అనంతమైన అవకాశాలు ఉన్నాయి. కృష్ణుడి చిన్ననాటి తుంటరి చేష్టల నుంచి కురుక్షేత్రంలో అందించిన భగవద్గీత జ్ఞానం వరకు ప్రతి ఘట్టం అద్భుతమైన కావ్యమని ఆయన భావిస్తున్నారు . ప్రాచీన జానపద కథలు, సాంప్రదాయ సంకీర్తనలకు ఆధునిక సంగీతాన్ని జోడించి సరికొత్తగా అందించడం ద్వారా అన్ని వయసుల శ్రోతలను శ్రీకృష్ణుని భక్తిమార్గం వైపు ఆకర్షించవచ్చని మ‌హదేవ‌న్ అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత తరం కళాకారులు శాస్త్రీయ, పౌరాణిక స్తోత్రాలను అంతర్జాతీయ స్థాయి సంగీత శైలులతో సమ్మిళితం చేసి సరికొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. పురాణాలలో వర్ణించిన ఆధ్యాత్మిక ఘట్టాలకు, గ్లోబల్ సంగీత వాద్యాలను మేళవించి సరికొత్త ప్రయోగాలు సాగిస్తున్నారు. మహర్షులు అందించిన కృష్ణ స్తోత్రాల లోతును నేటి తరం ప్రపంచ సంగీత అభిమానులకు అర్థమయ్యే రీతిలో ప్రాచుర్యంలోకి తీసుకురావడం విశేషం.

ప్రముఖ గేయ రచయితలు సూర్‌దాస్, మీరాబాయి వంటి మధ్యయుగ భక్తకవుల కావ్యాల్లోని ప్రేమామృతాన్ని కొనియాడుతున్నారు. రాధాకృష్ణుల నిశ్చలమైన, నిరపేక్షమైన అనురాగాన్ని వర్ణించే పదాలు భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. కృష్ణుడి జీవితాన్ని ఆయనతో అనుబంధం ఉన్న ముఖ్యమైన స్త్రీమూర్తుల దృక్కోణం నుంచి విశ్లేషిస్తూ ర‌చించిన‌ పాటల్లో నాటకీయతను, లోతైన భావోద్వేగాలను శ్రోతలకు అందిస్తున్నాయి.

సాంప్రదాయ భజనలు , కీర్తనలను నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రీమిక్స్ ... వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్, కోరస్ మేళవింపుతో రూపొందించే ధోరణి పెరుగుతోంది. యానిమేషన్ వీడియోలు, ఆధునిక శబ్దాల కలయికతో పాతకాలపు భక్తి భావాన్ని చెక్కుచెదరకుండా కాపాడుతూనే కొత్త రూపు ఇస్తున్నారు. భక్తి సాహిత్యం కాలంతో పాటు కొత్త ఆకృతులను సంతరించుకుని యుగయుగాలుగా భారతీయ సంస్కృతికి వెన్నుముకగా నిలుస్తోదనడంలో సందేహం లేదు.