హిట్ కోసం పదేళ్ల ఎదురు చూపులకు తెర పడేనా?
'కుచ్ కుచ్ హోతాహై' సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అయిన కరణ్ జోహార్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
By: Ramesh Palla | 19 Aug 2025 10:59 AM IST'కుచ్ కుచ్ హోతాహై' సినిమాతో బాలీవుడ్లో దర్శకుడిగా పరిచయం అయిన కరణ్ జోహార్ ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఆ సినిమా వచ్చి పాతిక ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉన్నారు. లవ్ స్టోరీ సినిమాలతో పాటు విభిన్న చిత్రాలను హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన కరణ్ జోహార్ ఈ మధ్య కాలంలో దర్శకత్వంకు దూరంగా ఉంటున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలను మించి నిర్మాతగా తీసుకు వస్తున్న కరణ్ జోహార్ దర్శకుడిగా మాత్రం సినిమాలను ఎక్కువగా చేయడం లేదు. గడచిన దశాబ్ద కాలంలో ఈయన నుంచి కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ పెద్ద విజయాలు లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రణ్వీర్ సింగ్ - ఆలియా భట్ జంటగా
కరణ్ జోహార్ ఎంతో మందిని స్టార్స్గా నిలబెట్టి స్టార్ మేకర్గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కరణ్ జోహార్ ఇలా హిట్ కొసం పడరాని పాట్లు పడుతూ ఉండటం ఏంటో అని ఇండస్ట్రీ వర్గాల వారు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరణ్ జోహార్ చివరగా 2023లో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణ్వీర్ సింగ్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్గా ఆ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం కరణ్ జోహార్ను తీవ్రంగా కలచి వేసింది. ఆ సమయంలోనే చాలా కష్టపడి తీసిన సినిమా ఫలితం ఇలా రావడంతో ముందు ముందు సినిమాలు చేయాలనే ఆసక్తి తగ్గుతుందని సన్నిహితులతో అన్నాడు అంటూ బాలీవుడ్ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. అందుకే చాలా గ్యాప్ తీసుకున్న కరణ్ జోహార్ ఎట్టకేలకు కొత్త సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.
2026 లో కరణ్ జోహార్ దర్శకత్వంలో
ఆ మధ్య ఒక యాక్షన్ సినిమాను చేయాలని భావించాడు. అయితే తన పంథా కు దూరంగా యాక్షన్ సినిమాను తీయడం ద్వారా మరింత ప్రేక్షకులకు దూరం కావాల్సి వస్తుందేమో అనే ఉద్దేశంతో మొదలు పెట్టిన ఆ ప్రాజెక్ట్ను షూటింగ్ ప్రారంభం కాకుండానే మరో దర్శకుడికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు తన రొటీన్ ఫార్ముల రొమాంటిక్ లవ్ డ్రామాతో సినిమాను చేసేందుకు గాను రెడీ అవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించాలని అనుకున్నప్పటికీ కాస్టింగ్ పరంగా ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. 2026 లో కరణ్ జోహార్ దర్శకత్వంలో సినిమా రాబోతుందని ఆయన సన్నిహితులు, ధర్మ ప్రొడక్షన్స్ కు చెందిన వారు చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ధర్మ ప్రొడక్షన్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
కరణ్ జోహార్ను అభిమానించే వారు సైతం ఖచ్చితంగా 2026 లో ఆయన కు కలిసి వస్తుంది. కరణ్ జోహార్లోని కొత్త వర్షన్తో ముందు ముందు సినిమాలు వస్తాయనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 53 ఏళ్ల కరణ్ జోహార్ లవ్ కమ్ రొమాంటిక్ మూవీస్ను ఎలా తీస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకునే విధంగా కరణ్ జోహార్ పక్కా ప్లానింగ్తో సినిమాలను ముందు ముందు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ధర్మ ప్రొడక్షన్స్ నుంచి అందుకు సంబంధించిన లీక్స్ వస్తున్నాయి. కరణ్ జోహార్ ఎక్కువగా యంగ్ స్టార్స్తో సినిమాలను రూపొందించే ఆలోచన చేస్తున్నాడు. సయ్యారా వంటి రొమాంటిక్ లవ్ స్టోరీ తీస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆధరిస్తారని అర్థం అవుతుంది. అందుకే కరణ్ జోహార్ ఆ జోనర్లో సినిమాలకు రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది తో అయినా పదేళ్ల ఎదురు చూపులకు తెర పడేనా అనేది చూడాలి.
