పార్టీ తానా అంటే తందానా అనై టైప్ కాదు!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.
By: Srikanth Kontham | 28 Aug 2026 8:09 AM ISTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి లోక్సభ సభ్యురాలు కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కంగన రాజకీయ కెరీర్, పార్టీతో సంబంధాలు , సినీ ప్రయాణం గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీకి కీలుబొమ్మను కాదని.. తనకంటూ సొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీలో ఉన్నా? ప్రతి విషయంలోనూ పార్టీ గీసిన గీత దాటకుండా ఉండలేనని కంగనా తేల్చిచెప్పారు.
`నేను పార్టీ నుంచి విడిపోవాలని కోరుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా మాట్లా డాల్సి వస్తుంది. బీజేపీ ఈరోజు నాతో ఉంది. రేపు ఉండకపోవచ్చు. నేను రెండేళ్లుగా ఎంపీగా ఉండొచ్చు. కానీ ఒక నటిగా నాకంటూ 20 ఏళ్లుగా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నా ఆలోచనలు ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటాయని స్పష్టం చేశారు. రాజకీయాలతో పాటు సినిమా కెరీర్ గురించి కూడా కంగనా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో ఇప్పటికీ అనేక మంది దర్శకులు తనతో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని.. తనను అత్యంత ఆకర్షణీయమైన నటిగా చూస్తున్నారని తెలిపారు.
సినిమా ఇండస్ట్రీ నుంచి తనకు ఇంకా అనేక ఆఫర్లు వస్తున్నాయని.. మంచి కథలు వస్తే వెండితెరపై నటిగా అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. అయితే రాబోయే రోజుల్లో చేసే పాత్రల విషయంలో రొటీన్ హీరోయిన్ వేషాల కంటే వయసుకు, వ్యక్తిత్వానికి సరిపోయే పాత్రలకే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. బాలీవుడ్లోని స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలు చేయడం కంటే `తలైవి` వంటి బయోపిక్లు లేదా డెమినేషన్కు సరిపోయే పవర్ఫుల్ పాత్రలనే ఎంచుకుంటానని స్పష్టం చేశారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ..స్టార్ హీరోల సినిమాలలో నటించడం కంటే తనకంటూ బలమైన పాత్రలు ఉండాలని అభిప్రాయపడ్డారు.
రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేమని, తనకు ఎలాంటి పదవులపై ...టికెట్ కోల్పోతామనే భయం లేదని కంగనా పేర్కొన్నారు. తాను రాజకీయాలకంటే ముందే ఒక సృష్టికర్తగా, రచయిత్రిగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నానని ఆ గుర్తింపు ఎప్పటికీ చెరిగిపోదని ధీమా వ్యక్తం చేశారు.
