ఏడాదిలో 4600కోట్ల నుంచి 7790 కోట్లకు టాప్ హీరోయిన్ ఆస్తి
భారతదేశంలో నికర ఆస్తుల్లో నంబర్ వన్ కథానాయికగా జూహీ చావ్లా పేరు రికార్డులలో శాశ్వతంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 4 Oct 2025 9:05 AM ISTభారతదేశంలో నికర ఆస్తుల్లో నంబర్ వన్ కథానాయికగా జూహీ చావ్లా పేరు రికార్డులలో శాశ్వతంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కింగ్ ఖాన్ షారూఖ్ తర్వాత ఆస్తి ఐశ్వర్యంలో జూహీ పేరు నిలకడగా వినిపిస్తోంది. గత ఏడాది నాటికి జూహీ చావ్లా, ఆమె కుటుంబ ఆస్తుల విలువ 4600 కోట్లు. కానీ ఒకే ఒక్క ఏడాదిలో ఈ ఆస్తి రెట్టింపు అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జూహీ చావ్లా ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్నారు. గత 15ఏళ్లలో అసలు సినిమాలే చేయడం లేదు. కానీ తన భర్త తో కలిసి వ్యాపారాల్లో తలమునకలుగా ఉన్నారు. దానికి తగ్గట్టే తన ఆదాయాన్ని పెంచుకుంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. జూహీ ఒకప్పుడు అగ్ర కథానాయికగా సినీపరిశ్రమను ఏలారు. హిందీ చిత్రసీమతో పాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లోను జూహీ సుపరిచితురాలు. అక్కినేని నగార్జున సరసన `విక్కీ దాదా` చిత్రంలో జూహీ నటించారు.
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ఎడిషన్ ప్రకారం.. జూహీ చావ్లా ఆస్తులు 4600 కోట్లు. కానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. జూహి చావ్లా నికర ఆస్తులు రూ. 7,790 కోట్లు (సుమారు 880 మిలియన్ డాలర్లు). ఒక్క ఏడాదిలోనే 3,190కోట్ల అదనపు సంపదలు ఎలా సాధ్యం? అన్నది ఆశ్చర్యపరుస్తోంది. ఇది నిజంగా ఇతర సంపాదనాపరుల కంటే వేగవంతమైన వృద్ధిగా భావించాలి.
జూహీ చావ్లా దేశంలోనే అత్యంత సంపన్న నటిగా స్థిరంగా కొనసాగుతోంది. ఆమె భర్త, పారిశ్రామికవేత్త జే మెహతా విజయవంతమైన బిజినెస్ మేన్ గా రాణిస్తున్నారు. రకరకాల వ్యాపారాల నుండి ఈ జంట భారీగా ఆర్జిస్తోంది. ఈ జంట కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి షారూఖ్ తో సహయజమానులుగా ఉన్నారు. ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తోను అనుబంధం కలిగి ఉన్నారు. జూహీ చావ్లా- జే మెహతా జంట రియల్ ఎస్టేట్ రంగంలోను సుప్రసిద్ధులు.
