Begin typing your search above and press return to search.

జాన్వీ పరమ్ సుందరి: టాక్ ఎలా ఉంది?

సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ డీసెంట్ బజ్ తోనే రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

By:  M Prashanth   |   29 Aug 2025 7:11 PM IST
జాన్వీ పరమ్ సుందరి: టాక్ ఎలా ఉంది?
X

బాలీవుడ్‌లో లవ్ స్టోరీ సినిమాలు గతంలో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పనిచేయలేదు. కానీ కొన్ని నెలల క్రితం వచ్చిన సైయరా మంచి హిట్ కావడంతో మళ్ళీ రొమాంటిక్ డ్రామాలకు అవకాశముందనే నమ్మకం వచ్చింది. ఆ జోరులోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పరమ్ సుందరి. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ డీసెంట్ బజ్ తోనే రిలీజ్ అయ్యింది. అయితే ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

థియేటర్లలో మొదటి షో నుండి బయటకు వస్తున్న ఆడియన్స్ టాక్ చూస్తే.. సినిమా చాలా వరకు ఊహించదగిన కథతో సాగిందని, అంత కొత్తదనం ఏమి లేదని చెబుతున్నారు. జాన్వీ కపూర్ పెర్ఫార్మెన్స్‌కి మాత్రం పరవాలేదు అనేలా ప్రశంసలు వస్తున్నాయి. ఆమె పాత్రలోని మలయాళ అమ్మాయి శైలి, డైలాగ్ డెలివరీ, భావ వ్యక్తీకరణ బాగుందని, కొన్ని సీన్స్‌లో తన తల్లిని అనుకరించిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ హీరోగా సిద్ధార్థ్ మల్హోత్రా ఆ పాత్రకు తగ్గట్లు లేదని స్క్రీన్‌పై కెమిస్ట్రీ అంతగా రాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలోని పాటలు, మ్యూజిక్ మాత్రం మంచి పాజిటివ్ పాయింట్‌గా నిలిచాయి. సచిన్-జిగర్ అందించిన ట్యూన్స్ యూత్‌కి బాగానే కనెక్ట్ అయ్యాయి. కేరళ లొకేషన్స్‌లో తీసిన విజువల్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కానీ కథా నిర్మాణంలో లాజిక్‌ మిస్ అయిందని, సన్నివేశాలు బలవంతంగా రాసినట్లు అనిపించాయని పబ్లిక్ రివ్యూలలో వినిపిస్తోంది. ముఖ్యంగా కామెడీ కోసం జోడించిన ట్రాక్, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా వర్క్ అవ్వలేదనే అభిప్రాయం బలంగా ఉంది.

ఇక కథలో ఉన్న క్లైమాక్స్ ట్విస్ట్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదని ప్రేక్షకులు చెబుతున్నారు. సుందరి పాత్రలో ఎమోషన్స్ సరిగా లేదని, ఎమోషన్స్ కన్‌విన్స్ చేయలేకపోయాయని చాలామంది ఫీల్ అవుతున్నారు. ఈ కారణంగానే సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని సోషల్ మీడియా రివ్యూల్లో ఉంది.

ఇక జాన్వీ నటన, మ్యూజిక్, కేరళ లొకేషన్లు కొంత బాగున్నా.. రొటీన్ స్టోరీ, హీరో క్యారెక్టర్, బలహీనమైన ఎమోషనల్ సీన్స్ సినిమాకు మైనస్ అని అంటున్నారు. మొత్తానికి పరమ్ సుందరి ఆడియన్స్‌ను పెద్దగా అయితే ఆకట్టుకోలేదు. ఇక జాన్వీ కపూర్ ప్రెజెన్స్‌తో మొదటి రోజు హైప్ తెచ్చుకున్నా, కంటెంట్ లోపం వల్ల బాక్సాఫీస్‌లో కఠిన పరీక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది.