జాన్వీ నో రెమ్యూనరేషన్... ఎందుకో తెలుసా?
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తోంది.
By: Ramesh Palla | 31 Oct 2025 5:00 PM ISTఅతిలోక సుందరి దివంగత శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ హీరోయిన్గా వరుస సినిమాలు చేస్తోంది. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కమర్షియల్ హిట్ కొట్టలేక పోయిన జాన్వీ కపూర్కి డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. స్టార్ కిడ్ కావడంతో పాటు, ఆమెకు ఇండస్ట్రీలో ఉన్న పరిచయాల కారణంగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఇండస్ట్రీలో అందరితోనూ సన్నిహితంగా ఉండటం, అందరిని గౌరవించడం వంటివి చేయడం ద్వారా జాన్వీ కపూర్ స్టార్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఆఫర్లు ఇస్తూ ఉంటారు. జాన్వీ కపూర్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్ ఆమె కెరీర్కి ఇప్పటికీ తనవంతు సాయం అన్నట్లుగా నిలుస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన బ్యానర్ నుంచి ఎలాంటి ఆఫర్ వచ్చినా, ఆయన సినిమాలకు తన నుంచి ఎలాంటి సాయం కావాల్సి ఉన్నా జాన్వీ కపూర్ ముందు ఉంటుంది.
హౌస్బౌండ్ సినిమా కోసం జాన్వీ కపూర్...
జాన్వీ కపూర్ పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్ హౌస్ తనకు హోం బ్యానర్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ధర్మ ప్రొడక్షన్స్ లో జాన్వీ కపూర్ నటించేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమెతో పాటు ఆమె సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఈ ఏడాది ధర్మ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన హోమ్ బౌండ్ సినిమాలో జాన్వీ కపూర్ నటించిన విషయం తెల్సిందే. 2025 సంవత్సరంకు గాను భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ ఎంట్రీని దక్కించుకున్న హోమ్ బౌండ్ సినిమాలో జాన్వీ కపూర్ నటించడం ద్వారా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వాల్ హీరోలుగా నటించిన హోమ్ బౌండ్ సినిమాను టీం మొత్తం కట్టుబడి పారితోషికం విషయంలో రాజీ పడి చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
జాన్వీ కపూర్ పారితోషికం ఎంత..?
తాజాగా ఈ విషయం గురించి ధర్మ ప్రొడక్షన్స్ ప్రతినిధి స్వయంగా మాట్లాడుతూ... హోమ్ బౌండ్ సినిమాలో నటించిన చాలా మంది నటీనటులు, వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు తమ పారితోషికంలో కొంత మేరకు మాత్రమే తీసుకున్నారు. ఇది ఒక చిన్న బడ్జెట్లో రూపొందించాల్సిన సినిమా అని వారికి తెలుసు. వారు అంతా కూడా సహకరించడం వల్లే ఆ సినిమా ఇలా మీ ముందుకు రాగలిగిందని ఆయన అన్నారు. అంతా తమ పారితోషికంలో కొంత భాగం మాత్రం తీసుకుని నటించడం, వర్క్ చేయడం చేస్తే జాన్వీ కపూర్ మాత్రం ఈ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు అంది. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలో తన స్టాఫ్ కి సైతం ఖర్చులు తానే భరించింది. ధర్మ ప్రొడక్షన్ పై ఆమెకు ఉన్న గౌరవం, అభిమానంతో అలా చేసిందని, పాత్రను ఓన్ చేసుకోవడం వల్లే అలా చేసి ఉంటుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు పెద్ది సినిమా...
బాలీవుడ్లో ధర్మ ప్రొడక్షన్ సినిమాలో నటించేందుకు నో రెమ్యూనరేషన్ అనే జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి చేస్తున్న పెద్ది సినిమాకు మాత్రం దాదాపుగా రూ.4 కోట్ల పారితోషికం అందుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. దేవర సినిమా కోసం కూడా భారీ పారితోషికంను జాన్వీ అందుకుంది. సౌత్ ఇండియాలో జాన్వీ కపూర్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆమెకు భారీ పారితోషికంను నిర్మాతలు ముట్టజెప్పుతున్నారు. కానీ బాలీవుడ్లో మాత్రం ఈమె ఇప్పటికీ ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. పెద్ది సినిమా హిట్ అయితే టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లోనూ ఈమె బిజీగా మారే అవకాశాలు ఉన్నాయి అనేది సినీ విశ్లేషకుల మాట. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న పెద్ది సినిమాను 2026 సమ్మర్ ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు అంతా సిద్దం చేస్తున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.
