ఏం ఉందిలే అని పెదవి విరిచేశాక స్లో పాయిజన్లా ఎక్కిన ప్రేమకథా చిత్రాలు!
కులం, మతం, భాష, సరిహద్దులు.. వేటితోనూ సంబంధం లేని ఒక అందమైన ప్రేమకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకం.
By: Sivaji Kontham | 22 Jun 2026 4:00 PM ISTకులం, మతం, భాష, సరిహద్దులు.. వేటితోనూ సంబంధం లేని ఒక అందమైన ప్రేమకావ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ శైలి ప్రత్యేకం. చాలా కాలం తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన `మై వాపస్ ఆవుంగా` చిత్రం మళ్లీ ఆ మ్యాజిక్ను రిపీట్ చేస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన `సయ్యారా` చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథగా పెద్ద విజయం సాధించగా, ఆ తర్వాత మళ్లీ ఒక స్లోపాయిజన్లా హృదయాలను హత్తుకుంటూ.. కంటతడి పెట్టించే అద్భుతమైన ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇంతియాజ్ సినిమా నిలుస్తోంది. సయ్యారాతో ఈ సినిమాకి పోలిక లేదు కానీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇది నెమ్మదిగా హృదయాలను పిండుతోంది. విడుదలైన కొత్తలో మిశ్రమ స్పందనలు వ్యక్తమైనా.. ప్రస్తుతం ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసిక్గా మారి.. స్లో పాయిజన్లా ప్రేక్షకుల మనసులకు ఎక్కుతూ భారీ విజయం వైపు అడుగులు వేస్తోంది.
ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగైదు రోజులు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా ప్రేక్షకుల నుంచి `మౌత్ టాక్` స్ప్రెడ్ అవ్వడం ప్రారంభమైంది. `సినిమాలో మంచి ఫీల్ ఉంది.. అద్భుతమైన ప్రేమకథ ఉంది.. ముఖ్యంగా క్లైమాక్స్లో కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుండి బయటకు రాలేరు!`` అంటూ ఒకరి నోటి నుంచి మరొకరికి పాజిటివ్ టాక్ పాకిపోయింది. దాంతో ఒక్కసారిగా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీతో కలెక్షన్లు కళ్లజూడటం మొదలైంది. సాధారణంగా సోమవారం రోజున చాలా సినిమాల వసూళ్లు పడిపోతుంటాయి... కానీ ఈ చిత్రం మాత్రం సోమవారం నాడు మిరాకిల్ గా మారి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. తను నమ్మి తీసిన సినిమాను ప్రేక్షకులు ఆలస్యంగానైనా గుర్తించి పెద్ద హిట్ చేస్తున్నందుకు దర్శకుడు ఇంతియాజ్ అలీ ఉబ్బితబ్బిబ్బవుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
`మై వాపస్ ఆవుంగా` కథ విషయానికి వస్తే.. ఇది సరిహద్దులు లేని, కాలంతో సంబంధం లేని ఒక అమరప్రేమ గాథ. ఈ చిత్రంలో దిల్జీత్ దోసాంజ్, శర్వరి, వేదంగ్ రైనా .. సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటించారు. దేశవిభజన నేపథ్యంలో ఇద్దరు ప్రేమికుల ఎమోషనల్ లవ్ స్టోరి రక్తి కట్టిస్తోంది. ఈ సినిమాలో నటీనటుల నటన, ఇంతియాజ్ అలీ మార్క్ స్క్రీన్ ప్లే, గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద `కాక్టైల్ 2` లాంటి భారీ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా పోటీగా ఉన్నప్పటికీ.. ఈ సినిమాలోని కంటెంట్, ఇంటెన్సిటీని గుర్తించిన ప్రేక్షకులు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. భాషా హద్దులను దాటేసి ప్రతి ఒక్కరినీ ఈ కథ కదిలిస్తోంది. ప్రారంభం స్లో నేరేషన్ అన్న వాళ్లే ఇదిరా ఫీల్ గుడ్ లవ్ స్టోరి అంటే అంటూ పొగిడేస్తున్నారు. అసలు భాషతో సంబంధం లేకుండా థియేటర్లకు వెళ్లి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని క్రిటిక్స్ ప్రశంసిస్తున్నారు.
సినిమా చరిత్రలో ఇలాంటి `స్లో పాయిజన్` చిత్రాలు కొత్తేమీ కాదు. గతంలో నాగార్జున కథానాయకుడిగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ `గీతాంజలి` కూడా ఈ కేటగిరీకి చెందినదే. విడుదలైన ఆరంభంలో హీరో హీరోయిన్లు ఇద్దరూ చివర్లో మరణించడం ఏమిటనే కోణంలో ఆ సినిమా ఎవరికీ అర్థం కాలేదు.. కానీ ఆ తర్వాత మౌత్ టాక్తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే బాలీవుడ్లో వచ్చిన `ఆషిఖీ`ఫ్రాంచైజీ సినిమాలు కూడా స్లో పాయిజన్లాగే మైండ్లోకి వెళ్లాయి. మొదటి భాగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాతి సినిమాలకు పెద్దగా ప్రచారం అవసరం లేకుండానే ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. మంచి ప్రేమకథ, అందులో నిజాయితీ ఉంటే జనాలు ఎప్పుడైనా ఆదరిస్తారని ఇవి నిరూపించాయి.
సరిగ్గా ఇలాంటి మ్యాజిక్నే టాలీవుడ్లో `పెళ్లి చూపులు` (2016), `సీతా రామం` (2022) చిత్రాలు కూడా సాధించాయి. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ నటించిన `పెళ్లి చూపులు` బడ్జెట్ పరిమితుల వల్ల ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలై ఆరంభ రోజుల్లో తక్కువ ఆదరణ పొందింది. కానీ.. ఆ తర్వాత సహజమైన కామెడీ.. మోడ్రన్ లవ్ స్టోరీతో మౌత్ టాక్ తెచ్చుకుని నేషనల్ అవార్డు సాధించే స్థాయికి ఎదిగింది. ఇక దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ల `సీతా రామం` చిత్రానికి కూడా మొదటి రోజు కలెక్షన్లు సాధారణంగానే ఉన్నా... రామ్-సీతల అమరప్రేమ కథ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించి, మౌత్ టాక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ లోనే లూటేరా, బర్ఫీ లాంటి చిత్రాలు కూడా ప్రారంభం ఏం ఉందిలే అంటూ పెదవి విరిచేసినా ఆ తర్వాత పెద్ద హిట్లయ్యాయి. ఇప్పుడు ఇంతియాజ్ అలీ `మై వాపస్ ఆవుంగా` కూడా అదే బాటలో క్లాసిక్ హిట్ వైపు దూసుకుపోతోంది.
