ప్రముఖ నటుడి ఇంట్లో గన్ ఫైరింగ్ వెనక కారణం?
ఆ ఘటన నన్ను కదిలించింది.. విన్న వెంటనే ఆందోళన చెందానని తెలిపారు. మామ గోవిందాపై కాల్పులు జరిగాయని తన తల్లి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది రాగిణి.
By: Sivaji Kontham | 5 Jan 2026 11:09 PM IST2024లో ప్రముఖ హిందీ నటుడు గోవిందా ఇంట్లో అర్థరాత్రి తుపాకీ పేలుడు కలకలం రేపిన ఘటనను ఇంకా ఎవరూ మరువలేదు. ఆరోజు రాత్రి అతడి ఇంటి చుట్టూ 50 మంది పోలీసులు ఉన్నారు. కనీసం 200 మంది ఆస్పత్రికి వచ్చారు. వారంతా అసలు ఏం జరిగిందో పరిశీలించారు. దర్యాప్తు కొనసాగింది. చివరికి గోవిందా తన రివాల్వర్ ని శుభ్రపరుస్తూ ఉంటే, పొరపాటున జారి కింద పడటంతో అది ట్రిగ్గర్ నొక్కుకుని పేలింది. తూటా నేరుగా అతడి తొడ భాగంలోంచి దూసుకెళ్లింది. గాయం తీవ్రమైనదే అయినా కానీ, అతడు చికిత్సతో కోలుకున్నాడు. ప్రాణాపాయం తప్పింది.
అయితే ఈ ఘటనపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. సహజంగానే సెలబ్రిటీల ఇళ్లలో ఏం జరిగినా ప్రజల్లో అనుమానాలు చెలరేగుతాయి. అతడి ఇంట్లో ఏం జరిగిందో అంటూ మీడియాలు కథనాలు అల్లాయి. ఒక తెలుగు స్టార్ హీరో ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనను, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో జరిగిన ఘటనను కూడా గుర్తు చేసాయి. ప్రజలు పదే పదే వాటన్నిటినీ తలుచుకున్నారు.
టీవీ చానెళ్లలో స్క్రోలింగులు గోవిందా కుటుంబీకులు, బంధుమిత్రులను కలవరపాటుకు గురి చేసాయి. ఆ సమయంలో గోవిందాను అమితంగా ప్రేమించే మేనకోడలు రాగిణి ఖన్నా కూడా చాలా కంగారు పడ్డారు. 2024 లో గోవింద తుపాకీ గాయంతో ఆసుపత్రిలో చేరినప్పుడు చాలా గాసిప్స్, ఊహాగానాలను ప్రచురించడంతో ఆమె కలవరపాటుకు గురయ్యారు. ఇది నిజంగా ప్రమాదమా? లేదా కథలో అంతకుమించి ఇంకేదైనా ఉందా? అనే సందేహం తనకు కలిగింది. కొన్ని నెలల తర్వాత చివరికి రాగిణి ఖన్నా ఈ ఘటనపై మాట్లాడారు.
ఆ ఘటన నన్ను కదిలించింది.. విన్న వెంటనే ఆందోళన చెందానని తెలిపారు. మామ గోవిందాపై కాల్పులు జరిగాయని తన తల్లి అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది రాగిణి. అది విన్నాక భయాందోళనకు గురైంది. ఇంతకీ ఎవరు కాల్చారు? అంటూ భయపడింది. ఆ తర్వాత అసలు నిజం తెలిసింది. గోవింద తుపాకీ శుభ్రం చేస్తున్నప్పుడు అది జారిపడి ప్రమాదవశాత్తు తనను తాను కాల్చుకున్నాడని తెలిసింది. ఆ తర్వాత తీవ్ర భావోద్వేగంతో అతడిని చూడటానికి ఆసుపత్రికి వెళ్లారు రాగిణి.
1 అక్టోబర్ 2024న ఈ ఘటన ముంబైలోని గోవింద నివశించే జుహు ఇంట్లో జరిగింది. గోవిందా తెల్లవారుఝామున 4గంటల సమయంలో తన రివాల్వర్ను శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుండి జారిపడి పేలిపోయింది. బుల్లెట్ అతని మోకాలి దిగువ నుంచి దూసుకెళ్లింది. వెంటనే అంధేరి వెస్ట్లోని క్రిటికేర్ ఆసియా ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రమైనదే కానీ ప్రాణాపాయం లేదు. వైద్యులు అతనికి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత అతను డిశ్చార్జ్ అయ్యాడు. కానీ యథావిథిగా మీడియా చాలా సిద్ధాంతాలను క్రియేట్ చేసింది. అన్నీ తెలిసినవాడు తనను తాను కాల్చుకుంటాడా? అని కొందరు సందేహం వ్యక్తం చేసారు. గోవిందా దుష్ప్రవర్తన గురించి కూడా కామెంట్లు చేసారు. ఇలాంటి పలు సంఘటనల గురించి చర్చ జరగడంతో అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మేనకోడలు రాగిణి అన్నిటికీ వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సీరియస్ గా దర్యాప్తు కొనసాగిందని, ఆసుపత్రిలో దాదాపు 200 మంది పోలీసు అధికారులు ఉన్నారని, గోవింద ఇంటి బయట దాదాపు 50 మంది పోలీసులు ఉన్నారని ఆమె వెల్లడించారు. వారు క్షుణ్ణంగా ప్రతిదీ విచారించారు. విచారణలో నిజాలను దాచిపెట్టడానికి ఎలాంటి ఆస్కారం లేదు. పోలీసులపై, వారి దర్యాప్తుపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆమె అన్నారు.
ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత గోవింద స్వయంగా మీడియాతో మాట్లాడుతూ గాయం తీవ్రమైనదని, దిగ్భ్రాంతికరమైనదని అన్నారు. ఘటన జరిగాక మొదట తాను నమ్మలేకపోయానని చెప్పాడు. ఆ తర్వాత తన స్వభావరీత్యా కొంచెం నిర్లక్ష్యంగా ఉంటానని చెప్పుకుంటూ, తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అంగీకరిస్తూ బాధ్యతను కూడా స్వీకరించాడు. ఇటీవలి కాలంలో గోవిందాతో నిరంతరం భార్య గొడవపడుతుండడం కూడా ప్రధానంగా మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే.
