దుల్కర్.. తెలుగులో మరో క్రేజీ కాంబో
మొదటి క్లాప్ కొట్టడంతో పాటు, నిర్మాత సుదీప్ గున్నం, రమ్య గున్నం, దర్శకుడు రావి చేతుల మీదుగా స్క్రిప్ట్ను టీమ్కు అందజేశారు
By: M Prashanth | 4 Aug 2025 4:09 PM ISTటాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్తో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభమైంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పటికే లక్కీ భాస్కర్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. ఇక నెక్స్ట్ తెలుగు ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ ఇస్తున్నాడు. వరుస విజయాలతో తెలుగు మార్కెట్లో ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న దుల్కర్, ఈసారి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్తో కలిసి ఓ భారీ సినిమా చేయబోతున్నాడు.
ఈ ప్రాజెక్ట్కు రావి నెలకుడిటి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు సుధాకర్ చెరుకూరి చేపట్టగా, మల్టీ లెవెల్ పాన్ ఇండియా కాన్సెప్ట్తో రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో అత్యంత గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకకు స్పెషల్ గెస్ట్గా నేచురల్ స్టార్ నాని హాజరయ్యారు. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చి టీమ్కు బెస్ట్ విషెస్ తెలిపారు.
మొదటి క్లాప్ కొట్టడంతో పాటు, నిర్మాత సుదీప్ గున్నం, రమ్య గున్నం, దర్శకుడు రావి చేతుల మీదుగా స్క్రిప్ట్ను టీమ్కు అందజేశారు. ఈ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సనా కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో వైపు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించిన ఈ కార్యక్రమం సినీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
దుల్కర్ ఎస్ఎల్వీ సినిమాస్ కాంబోతో వస్తున్న ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుసగా కంటెంట్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్లు ఎంచుకుంటున్న దుల్కర్, ఈ సినిమాలో కూడా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ని ఎంచుకున్నట్టు టాక్. దర్శకుడు రావి, ఈ సినిమాను యూనిక్ గా, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు కథపై భారీగా వర్క్ చేశారట.
ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్గా రూపొందుతుండటంతో టెక్నికల్ టీమ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ విభాగాల్లో ఇండస్ట్రీలో టాప్ టాలెంట్ను తీసుకున్నారు. సాధారణంగా దుల్కర్ పాత్రలు వైవిధ్యంగా ఉంటాయని తెలిసిందే. ఈ సినిమాలో కూడా అతని లుక్, పాత్ర తీరు, ప్రెజెంటేషన్ కొత్తదనం ఉండబోతోందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంతో సినిమాకు అధికారికంగా ముహూర్తం పలికారు. అలాగే, రెగ్యులర్ షూట్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలకు సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయని నిర్మాత సుధాకర్ చెరుకూరి తెలిపారు.
