థియేటర్లలోనే కాదు పైరసీలోను రికార్డ్
రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ `ధురంధర్` ప్రస్తుతం పైరసీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తోంది.
By: Sivaji Kontham | 18 Jan 2026 10:09 PM ISTరణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ `ధురంధర్` ప్రస్తుతం పైరసీ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తోంది. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో రికార్డులు తిరగరాయడమే కాకుండా, పైరసీ వెబ్సైట్లలో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా పైరసీ వ్యవహారం ఎల్లపుడూ హాట్ టాపిగ్గా మారింది. ఈ సినిమా ఓవైపు విజయవంతంగా ఆడుతున్నా, పాకిస్తాన్ సహా గల్ఫ్ దేశాల్లో విడుదల కాలేదు. అయితే బ్లాక్ బస్టర్ టాక్ రావడం, దానికి తోడు పాకిస్తాన్ లో ఇండియన్ స్పై ఆపరేషన్ కథాంశం కావడం, పాక్ లో రెహ్మాన్ డెకైత్ అనే మాఫియా డాన్ కథను హైలైట్ చేసారనే టాక్ రావడంతో పాకిస్తాన్ ప్రజల్లోను క్యూరియాసిటీ పెరిగింది. కానీ అక్కడి ప్రభుత్వం ఈ చిత్రంపై నిషేధం విధించింది. నిషేధం విధించినా కానీ, విడుదలైన కేవలం 12 రోజుల్లోనే పాకిస్థాన్లో 20 లక్షల (2 మిలియన్లు) కంటే ఎక్కువగా పైరసీలో డౌన్లోడ్లు చేసుకుని ఈ సినిమాని వీక్షించడం సంచలనమైంది. గతంలో రజనీకాంత్ 2.0, షారుఖ్ ఖాన్ `రాయీస్` పేరిట ఉన్న పైరసీ రికార్డులను ఇది చెరిపివేసింది. టెలిగ్రామ్ టొరెంట్స్, వీపీఎన్ల ద్వారా ఈ సినిమాను అక్కడి ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నట్లు కథనాలొచ్చాయి. దురంధర్ పైరసీ రికార్డుల నేపథ్యంలో ఇకపై రిలీజ్ కి రాబోతున్న ధురంధర్ 2కి పైరసీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని కూడా అంచనా వేస్తున్నారు.
పైరసీ సవాళ్లు ఎలా ఉన్నా కానీ, `ధురంధర్` బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ట్రేడ్ ప్రకారం.. ప్రపంచవ్యాప్త సుమారు 1240 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో దాదాపు రూ.818 కోట్ల నెట్ వసూళ్లతో 2025లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమాని గల్ఫ్ దేశాలు, పాకిస్తాన్లో నిషేధం విధించడంతో దాదాపు 100 కోట్లు నష్టపోయిందని పలువురు ట్రేడ్ అనలిస్టులు పేర్కొన్నారు. అయినా ఇతర ఓవర్సీస్ నుంచి చెప్పుకోదగ్గ వసూళ్లను సాధించింది.
భారత గూఢచారి అజిత్ దోవల్ జీవితంలోని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, పాకిస్థాన్లోని లియారీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, దీని సీక్వెల్ `ధురంధర్ 2`ను 2026 మార్చి 19న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.
