తారక్, పవన్ పిటిషన్లు.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్లపై నేడు కీలక విచారణ జరిగింది.
By: M Prashanth | 22 Dec 2025 5:55 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పర్సనాలిటీ రైట్స్ పిటిషన్లపై నేడు కీలక విచారణ జరిగింది. తమ అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్ ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ.. తారక్, పవన్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తమ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడంతోపాటు అవమానకరమైన పోస్టులు వైరల్ కావడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని ఇద్దరు స్టార్ హీరోలు పిటిషన్లలో పేర్కొన్నారు. చర్యలు తీసుకోవాలని, స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో ఆ వ్యవహారంపై జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది జే సాయి దీపక్ వాదనలు వినిపించారు. సోషల్ మీడియా వేదికల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు, తప్పుడు వీడియోలు, అవమానకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లు అనుమతి లేకుండానే ఇమేజెస్ ను వాణిజ్యంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు.
ఈ కేసులో ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్స్ (ట్విట్టర్), గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. విచారణ సందర్భంగా ప్రతివాద సంస్థల తరఫున న్యాయవాదులు స్పందిస్తూ, ఫిర్యాదు అందిన వెంటనే అభ్యంతరకరంగా ఉన్న కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పలు కీలక సూచనలు చేసింది. ఏదైనా లింకును శాశ్వతంగా తొలగించే ముందు, ఆ కంటెంట్ను పోస్ట్ చేసిన వినియోగదారుడి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
అలాగే ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అభిమానుల ఖాతాల ద్వారా వచ్చే పోస్టుల విషయంలో.. అవి అధికారిక ఖాతాలు కాదని స్పష్టంగా అందరికీ తెలియజేసేలా డిస్క్లైమర్ ఉండాలని సూచించింది. అభ్యంతరకర కంటెంట్ ఉన్న ఖాతాల వివరాలను గూగుల్ సంబంధిత వినియోగదారులకు తెలియజేయాలని, అవసరమైతే ఆ ఖాతాలను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
వివాదాస్పద పోస్టులకు సంబంధించిన బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలను మూడు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 12వ తేదీకి వాయిదా వేసింది. సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ విషయంలో కోర్టు ఇవ్వనున్న తీర్పు కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని న్యాయ వర్గాలు ఇప్పుడు అభిప్రాయపడుతున్నాయి. భవిష్యత్తులో ఇతర రంగాల ప్రముఖులకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉందని చెబుతున్నాయి.
