దీపికాలో ఆనాడే గ్లోబల్ స్పార్క్ చూసి తొలి దర్శకుడు!
తాజాగా అమ్మడి ప్రయాణాన్ని ఉద్దేశించి కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
By: Srikanth Kontham | 19 Sept 2026 3:00 PM ISTబాలీవుడ్ లో దీపికా పదుకొణే ఎలా సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా? తారా స్థాయికి చేరింది. అందుకోసం దీపిక ఎంతో కష్టపడింది. ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు సతం ఎదుర్కుంది. కానీ దీపిక ఎదుగుదలను ఏ అవమానం ఆపలేకపోయింది. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న నానుడి దీపిక బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. అక్కడ నుంచి హాలీవుడ్ లో సైతం సత్తా చాటే ప్రయత్నం చేసింది.
తాజాగా అమ్మడి ప్రయాణాన్ని ఉద్దేశించి కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 2006లో రిలీజ్ అయిన `ఐశ్వర్య` చిత్రం ద్వారా దీపికను వెండి తెరకు పరిచయం చేసిన ఇంద్రజిత్ ఆమెతో ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దీపికా స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా ఉన్న రోజుల్లోనే తనకు పరిచయముందని, ఆ తర్వాత తాను దర్శకుడిగా, ఆమె మోడల్గా మారామని తెలిపారు. `ఐశ్వర్య` సినిమా కథ చెప్పడానికి పూజా దద్లానీతో కలిసి మొదటి సమావేశానికి వచ్చిన రోజే దీపిక ప్రతిభ, వృత్తిపట్ల ఉన్న క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు.
ఖచ్చితంగా పెద్ద స్టార్ అవుతుందని తాను ఆనాడే భావించినట్లు చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలోనే దీపికలోని దృష్టి, ఆంబిషన్, కష్టపడే తత్వాన్ని గమనించినట్లు ఇంద్రజిత్ తెలిపారు. `నువ్వు కన్నడ లేదా బాలీవుడ్కే పరిమితం కావు. గ్లోబల్ స్టార్గా ఎదిగే సత్తా నీలో ఉంది` అని చిత్రీకరణ సమయంలోనే చెప్పానని గుర్తు చేసుకున్నారు. అనుకున్నట్లుగానే `ఓం శాంతి ఓమ్` తో బాలీవుడ్ అరంగేట్రం చేసిన దీపిక హాలీవుడ్ వరకు ముద్రను వేసుకుందని ఆనందం వ్యక్తం చేశారు.
అలాగే దీపిక లేవనెత్తిన పనిగంటల విషయంలోనూ ఇంద్రజీత్ మద్దతుగా నిలిచారు. దర్శకుడిగా తాను కూడా రోజుకు 6 నుండి 7 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తానని.. నటీనటులు ఎనిమిది గంటలకు మించి పనిచేస్తే ఆ అలసట కెమెరాలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పరిశ్రమలో పనివేళలపై సరైన సమతుల్యత ఉండాలన్న దీపికా అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే కొత్త నటీనటులను పరిచయం చేయడంపై ఇంద్రజిత్ స్పందించారు. నూతన నటీనటులు చెక్కని వజ్రాలు వంటివారని అభివర్ణించారు. వారిపై ఎలాంటి పాత ఇమేజ్ ప్రభావం ఉండకపోవడంతో దర్శకుడికి పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ లభిస్తుందన్నారు. తన నుంచి రాబోయే పాన్-ఇండియా చిత్రం `జై హింద్ జై సింద్: ఎ లవ్ స్టోరీ` ద్వారా అకైషా వత్స్ అనే కొత్త నటిని కూడా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కళాకారుడిలో ప్రతిభను, ఆసక్తిని గుర్తించినప్పుడు వారికి సరైన వేదికను అందించడమే నిజమైన దర్శకుడి పని అని ఇంద్రజిత్ ముగించారు.
