సమస్య మరీ ముదిరాక మెగా బాస్ ఎంట్రీ ఇచ్చినా కానీ!
ఏదైనా సమస్యను ఆదిలోనే తుంచేయాలి... లేదంటే అది ముదిరి పాకాన పడి అందరి మెడకూ చుట్టుకుంటుంది.
By: Sivaji Kontham | 15 May 2026 12:00 PM ISTఏదైనా సమస్యను ఆదిలోనే తుంచేయాలి... లేదంటే అది ముదిరి పాకాన పడి అందరి మెడకూ చుట్టుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో నెలకొన్న పరిస్థితులు సరిగ్గా ఇలానే కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎగ్జిబిటర్లు.. నిర్మాతల మధ్య రేగుతున్న వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ సమస్యపై పరిష్కారం కోసం సినీ పెద్దలు తాజాగా సుదీర్ఘంగా చర్చించి.. లోతుగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీని కూడా వేశారు. అయితే ఈ కమిటీ నివేదికలు ఇచ్చేలోపు పరిస్థితి మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న చర్చల ప్రకారం.. ఈ గొడవకు ముగింపు పలకాలంటే మెగాస్టార్ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగాల్సిందే. ఇప్పటివరకూ చిరంజీవి ఈ వివాదంపై కేవలం కన్నేసి ఉంచారే తప్ప... నేరుగా స్పందించలేదు. తనయుడు రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం `పెద్ది` మరో కొన్ని వారాల్లో విడుదల కావాల్సి ఉంది. ఈలోపు సమస్య పరిష్కారం కాకపోతే `పెద్ది` విడుదల కాంప్లికేటెడ్ గా మారే అవకాశం ఉంది. అందుకే చిరంజీవి ఇరు వర్గాలను పిలిచి మాట్లాడితేనే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని టాలీవుడ్ ప్రముఖులు ఆశిస్తున్నారు.
తెలంగాణలోని నిజాం ఏరియా సింగిల్ స్క్రీన్ యజమానులు ఇకపై అద్దె విధానంలో పని చేయలేమని.. కేవలం పర్సంటేజీ మోడల్లోనే సినిమాలు ఆడిస్తామని తెగేసి చెబుతున్నారు. అయితే ఈ కొత్త మోడల్ను `పెద్ది` మూవీ నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని - సతీష్ అంగీకరించడం లేదు. వారంతా పాత పద్ధతి అయిన లీజు లేదా అద్దె విధానమే ముద్దని పట్టుబడుతున్నారు. ఈ పరస్పర విరుద్ధ వాదనల మధ్య `పెద్ది` వంటి భారీ చిత్రాల భవిష్యత్తు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.
ఈ వివాదం కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా వ్యక్తిగత స్థాయికి చేరుకోవడం అసలు సమస్యగా మారింది. ప్రముఖ తెలంగాణ పంపిణీదారుడు ఏషియన్ సునీల్ నారంగ్పై మైత్రి రవిశంకర్, యువ నిర్మాత నాగవంశీ సెటైర్లు కురిపించడంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. వారి మధ్య మాటల యుద్ధం ముదిరి ఒకరిపై ఒకరు రుబాబు చూపించుకునే స్థాయికి చేరింది. ఇలాంటి తరుణంలో ఒక పెద్ద మనిషిగా చిరంజీవి చొరవ తీసుకుని అందరినీ ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో నిర్మాతలకు, ఫెడరేషన్కు మధ్య గొడవ జరిగినప్పుడు కూడా మెగా బాస్ చిరంజీవి కాస్త ఆలస్యంగా స్పందించడంతో పరిస్థితి చేయి దాటిపోయిన విషయాన్ని ఇప్పుడు ఇండస్ట్రీ గుర్తు చేసుకుంటోంది. ఇప్పుడు కూడా మెగా బాస్ మరీ ఆలస్యంగా ఎంట్రీ ఇస్తే నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పరిశ్రమకు పెద్ద దిక్కుగా భావించే ఆయన నేరుగా ఇన్వాల్వ్ అయ్యి తనవంతు ప్రయత్నం చేసి క్లియర్ చేస్తేనే `పెద్ది` వంటి సినిమాలు సజావుగా విడుదలవుతాయి. బాస్ ఆ రేంజ్ లో బరిలోకి దిగి ఈ సమస్యకు ఒక ముగింపు పలుకుతారని టాలీవుడ్ వర్గాలన్నీ ఆసక్తిగా వేచి చూస్తున్నాయి.
