మాస్ ఇమేజ్ కు క్లాస్ టచ్ ఇస్తున్నారా?
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఆచితూచి అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 10 May 2026 1:40 PM ISTమెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్లో ఆచితూచి అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. కమర్షియల్ హంగులున్న కథలకే కాకుండా కథా బలమున్న చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే
నవతరం దర్శకులతో పనిచేయడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు. `రాజాసాబ్` సినిమా గనుక హిట్ అయి ఉంటే చిరంజీవి మారుతితో కూడా ఓ సినిమా పట్టాలెక్కించేవారే. అతడితో సినిమా చేస్తానని పబ్లిక్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళ దర్శకుడు తరుణ్ మూర్తి- చిరంజీవి భేటీ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ భేటీ మర్యాదపూర్వకమైనది కాదని ఇద్దరి మధ్య భారీ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సినీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. విలక్షణమైన కథాంశం చుట్టూ ఈ చర్చలు సాగుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. తరుణ్ మూర్తి `ఆపరేషన్ జావా`, `సౌదీ వెళ్ళక్క` వంటి చిత్రాలతో మలయాళంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవికతకు దగ్గరగా ఉంటూనే ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథను నడిపించడంలో ఆయన సిద్ధహస్తుడు.
మెగాస్టార్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి క్లాసిక్ మేకర్తో జతకట్టడం అన్నది జరిగితే? అది పెద్ద ప్రయోగమే అవుతుంది. సాధారణంగా చిరంజీవి సినిమా అంటే భారీ యాక్షన్ సీక్వెన్స్లు, డ్యాన్సులు ఆశిస్తారు. ఒకవేళ తరుణ్ మూర్తితో ప్రాజెక్టు ఒకే అయితే? అందులో చిరంజీవి పూర్తి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తారు. సన్నిహిత వర్గాల నుంచి చిన్న ఓ లీక్ కూడా అందింది. సామాన్యుడి పోరాటాన్ని లేదా ఎమోషనల్ డ్రామాను హైలైట్ చేసేలా ఈ కథ ఉంటుందని లీక్ అందింది. చిరంజీవి వయసుకు , ఇమేజ్కు సరిపోయేలా అదే సమయంలో నేటి తరం ప్రేక్షకులను మెప్పించేలా కొత్త రకమైన బాడీ లాంగ్వేజ్ను ఈ సినిమాలో చిరంజీవి ప్రదర్శించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం చిరంజీవి ఒరిజినల్ కథలకే మొగ్గు చూపుతున్న నేపథ్యంలో తరుణ్ మూర్తి ఫ్రెష్ స్క్రిప్ట్ను మెగాస్టార్ కోసం సిద్ధం చేసి ఉండొచ్చు. మలయాళ మేకర్స్ చూపే సహజత్వం, తెలుగు కమర్షియల్ హంగులతో కలిస్తే బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే వశిష్ట దర్శకత్వంలో `విశ్శంభర` అనే సోషియ్ ఫాంటసీ చిత్రాన్ని కూడా తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యంగా కారణంగా వాయిదా పడుతుంది. మరోవైపు `దసరా` ఫేం శ్రీకాంత్ ఓదెలతో కూడా ఓ ప్రాజెక్ట్ లాక్ చేసారు. ఆ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.
