Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌హాస‌న్‌పై గాయ‌ని చిన్మ‌యి రుస‌రుస‌

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా తన గళాన్ని విప్పారు. ఈసారి లోకనాయకుడు కమల్ హాసన్‌పై చిన్మ‌యి తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసారు.

By:  Sivaji Kontham   |   14 March 2026 11:40 PM IST
క‌మ‌ల్‌హాస‌న్‌పై గాయ‌ని చిన్మ‌యి రుస‌రుస‌
X

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సామాజిక మాధ్యమాల వేదికగా తన గళాన్ని విప్పారు. ఈసారి లోకనాయకుడు కమల్ హాసన్‌పై చిన్మ‌యి తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసారు. మీటూ (#MeToo) ఉద్యమ సమయంలో ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వైరముత్తుకు ప్రతిష్టాత్మకమైన `జ్ఞానపీఠ` పురస్కారం దక్కిన సందర్భంగా కమల్ హాసన్ ఆయనను ప్రశంసలతో ముంచెత్తడం చిన్మయిని తీవ్ర అసహనానికి గురిచేసింది.

వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు రావడంపై కమల్ హాసన్ స్పందిస్తూ.. ఆయన సాహితీ పటిమను కొనియాడారు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందిస్తూ ``పురుషులు ఎప్పటికీ మా వైపు (బాధితుల వైపు) ఉండరు`` అంటూ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఇంతటి గౌరవం దక్కడం.. దానికి తోడు పరిశ్రమలోని పెద్దలు ఆయనను సమర్థించడం తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు.

2018లో మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని చిన్మయి ధైర్యంగా బయటపెట్టారు. అప్పటి నుండి ఈ గాయ‌ని కం డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ తమిళ చిత్ర పరిశ్రమలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తన ఆరోపణల వల్ల తనకు రావాల్సిన అవకాశాలు తగ్గిపోయాయని.. డబ్బింగ్ యూనియన్ నుండి తనను తొలగించారని గతంలోనే వాపోయారు. ఇంత జరిగినా వైరముత్తుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆయన నిర్దోషిగా చలామణి అవుతున్నారనేది చిన్మ‌యి వాదన.

న్యాయం కోసం తాను చేస్తున్న పోరాటంలో చిత్ర పరిశ్రమలోని పురుషులు తనకు అండగా నిలబడలేదని చిన్మయి ఆరోపించారు. వైరముత్తుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయనను సామాజికంగా లేదా వృత్తిపరంగా ఎవరూ వెలివేయలేదని.. పైగా ఇప్పుడు అత్యున్నత పురస్కారాలతో ఆయనను గౌరవిస్తున్నారని చిన్మ‌యి మండిపడ్డారు. బాధితుల కంటే వేధించే వారికే సమాజంలో ఎక్కువ గుర్తింపు లభిస్తుందని రుసరుసలాడారు.

కమల్ హాసన్ వంటి పెద్ద నటులు సామాజిక సమస్యలపై గళమెత్తుతుంటారని.. కానీ తన విషయంలో మాత్రం ఆయన మౌనంగా ఉంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పొగడటం ద్వంద్వ నీతికి నిదర్శనమని చిన్మయి అభిప్రాయపడ్డారు. అధికారం, పలుకుబడి ఉన్న పురుషులు ఒకరికొకరు రక్షణగా నిలబడతారు.. బాధితుల గోడు వారికి వినిపించదు అని చిన్మ‌యి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం చిన్మయి చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక వర్గం నెటిజన్లు ఆమె పోరాటానికి మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు సాహిత్యానికి, వ్యక్తిగత ఆరోపణలకు ముడిపెట్టవద్దని వాదిస్తున్నారు. ఏది ఏమైనా జ్ఞానపీఠ పురస్కారం చుట్టూ ఇప్పుడు చిన్మయి లేవనెత్తిన `మీటూ` వివాదం మరోసారి హాట్ టాపిక్ అయింది.