'అఖండ 2' చూసి రివ్యూలు రాయాలి.. చిలుకూరు బాలాజీ అర్చకుల సూచన
కనీసం 5 నిమిషాలు థియేటర్లలో కూచోలేని వ్యక్తులు `అఖండ 2`పై రివ్యూలు రాయకూడదని, సినిమా చూసి రివ్యూలు రాయాలని అన్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీరంగ రాజన్.
By: Sivaji Kontham | 24 Dec 2025 9:46 AM ISTకనీసం 5 నిమిషాలు థియేటర్లలో కూచోలేని వ్యక్తులు `అఖండ 2`పై రివ్యూలు రాయకూడదని, సినిమా చూసి రివ్యూలు రాయాలని అన్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీరంగ రాజన్. ఈ చిత్రంలో హిందూ ధర్మ ప్రాశస్థ్యాన్ని అద్భుతంగా చూపించారని బోయపాటి- బాలయ్య బృందాన్ని ఆయన ప్రశంసించారు.
తాను అఖండ 2 సినిమాని చూసానని, ధర్మాన్ని కాపాడేందుకు భగవంతుడు ఏదో ఒక రూపంలో వెలసి ఇలాంటి కార్యాలు చేస్తాడని అర్చకులు రంగరాజన్ అన్నారు. ఈ సినిమాని పిల్లలు సహా కుటుంబ సమేతంగా చూడాలని కూడా ఆయన సూచించారు.
పాశ్చాత్య దేశాలలో పురుషులు అర్థేచ, మోక్షేచ అని ఆ రెండిటికోసమే జీవిస్తున్నారు. కానీ పవిత్ర భారతదేశంలో అలా కాదు. ఇక్కడ ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ అనే నాలుగు విషయాలను పాటిస్తారు. ధర్మం గురంచి ఇక్కడ మాత్రమే ఆలోచిస్తున్నాము. ఆ ధర్మం లేనప్పుడు ఏదో ఒక రూపంలో భగవంతుడు వస్తాడని బోయపాటి ఈ చిత్రంలో చూపించిన తీరు ఆకట్టుకుంది. సినిమాని రెప్ప వేయకుండా కదలకుండా థియేటర్లలో వీక్షించానని అర్చకులు శ్రీరంగరాన్ అన్నారు.
బాలకృష్ణ నటించిన అఖండ 2: తాండవం చిత్రం బాక్సాఫీస్ వద్ద తన రెండవ వారాన్ని అధిగమించనుంది. వసూళ్లలో దాదాపు 50 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో నాల్గవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సాక్నిల్క్ వివరాల ప్రకారం.. అఖండ 2 చిత్రం విడుదలైన 12వ రోజున భారతదేశంలో రూ.55 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. 11వ రోజు నుండి 12వ రోజుకు వసూళ్లు సుమారుగా 47.6 శాతానికి తగ్గాయి. 11వ రోజున, ఈ చిత్రం రూ.1.05 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ 1.03 కోట్లు, హిందీ వెర్షన్ ఒక లక్ష, తమిళ వెర్షన్ ఒక లక్ష వసూలు చేసాయి.
ఈ చిత్రం ఇప్పుడు రూ.86 కోట్ల మార్కును అధిగమించింది. అఖండ 2 బాలకృష్ణ కెరీర్లో 4వ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని సాక్ నిల్క్ పేర్కొంది. అఖండ 2 ఎన్బీకే నటించిన చిత్రం భగవంత్ కేసరి వసూళ్లను అధిగమించింది. భగవంత్ కేసరి భారతదేశంలో రూ.84.78 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా... ఇప్పుడు అఖండ 2 ఆ సినిమాని వెనక్కి నెట్టి నాల్గవ స్థానాన్ని దక్కించుకుంది. అఖండ నికర వసూళ్లు భారతదేశంలో 89 కోట్లు, డాకు మహారాజ్ రూ.90.93 కోట్లు, వీర సింహా రెడ్డి రూ.97.64 కోట్ల నికర వసూళ్లను భారతదేశంలో సాధించాయి. నికర వసూళ్లతో పోలిస్తే గ్రాస్ వసూళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. విదేశీ వసూళ్లను కలుపుకుని అఖండ 2 చిత్రం 100కోట్ల నికర వసూళ్లను సాధించిందని కూడా కథనాలొచ్చాయి.
