బల్క్ టికెట్ బుకింగులతో ఇండస్ట్రీకి ముప్పు: అగ్రనిర్మాత
ఓటీటీల రాకతో అంతా మారిపోయింది. ఓవర్ ది టాప్ కంటెంట్ గేమ్ ఛేంజర్గా మారింది. అయితే అదే సమయంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమా సమస్యల్లో పడింది.
By: Sivaji Kontham | 8 Sept 2025 7:00 AM ISTఓటీటీల రాకతో అంతా మారిపోయింది. ఓవర్ ది టాప్ కంటెంట్ గేమ్ ఛేంజర్గా మారింది. అయితే అదే సమయంలో థియేటర్లలో విడుదలయ్యే సినిమా సమస్యల్లో పడింది. జనం థియేటర్ల వైపు రావడం మానేసారు. దీంతో ఏ సినిమా అసలైన విజయం సాధించింది? ఏది ఫేక్ సక్సెస్? అనేది గుర్తించడం సమస్యగా మారింది. ఓటీటీ ధరలను నిర్ణయించడానికి బాక్సాఫీస్ మైలు రాయి కీలకంగా మారిన నేపథ్యంలో ఓటీటీ ఆదాయం కోసం నిర్మాతలు వెంపర్లాడుతున్నారు. వంద కోట్లు అంతకుమించి వసూలు చేసిన సినిమాకి అప్పటికే చేసుకున్న ఒప్పందంపై మరో 5కోట్లు అదనంగా ఓటీటీలు చెల్లిస్తున్నాయి. 150కోట్లు, 200 కోట్లు, అంతకుమించి వసూళ్లు సాధిస్తే దానికి తగ్గట్టుగానే అదనంగా ఓటీటీలు చెల్లింపులు చేస్తాయి.
అయితే ఓటీటీల నుంచి ఈ నజరానాలు అందుకునేందుకు కొందరు ఫేక్ కలెక్షన్లను సృష్టించేందుకు వెనకాడటం లేదు. బల్క్ కార్పొరెట్ బుకింగుల పేరుతో కొందరు థియేటర్లలో సీట్లను లాక్ చేసి కృత్రిమ హైప్ ని క్రియేట్ చేస్తున్నారని తాజా ఇంటర్వ్యూలో అగ్ర నిర్మాత బోనీకపూర్ అంగీకరించడం హాట్ టాపిగ్గా మారింది. ఓటీటీ ధరల కోసం సినిమాని చంపుతున్నారని కూడా అన్నాడు. కృత్రిమ బాక్సాఫీస్ లెక్కలు సినిమా విజయంపై ప్రజల్లో అనుమానాలను పెంచుతాయని బోనీ వ్యాఖ్యానించారు. పెంచిన కలెక్షన్లను చూపించడం, స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్ల నుండి ఎక్కువ సంపాదించడం కోసమేనని అన్నారు.
అసలైన సమీక్షలు ప్రజల నుంచి వస్తాయి. వారు మంచి సినిమాని గుర్తిస్తారు. చెడ్డ సినిమాని విమర్శిస్తారు. ప్రేక్షకుల సమీక్షలు, విమర్శనాత్మక ఆదరణ కారణంగా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవ వసూళ్లతో తేలిపోతున్నాయని విశ్లేషించారు. అమీర్ ఖాన్ లాంటి కొందరు మాత్రమే ఓటీటీలకు రైట్స్ అమ్మకుండా నిజాయితీగా `సీతారే జమీన్ పార్` సినిమాని థియేటర్ లో ఉంచేందుకు ప్రయత్నించారని అన్నారు. ఓటీటీలకు సినిమాలను అమ్మకూడదని కూడా బోనీ అన్నారు. యష్ రాజ్ ఫిలింస్ సయ్యారా చిత్రాన్ని ఓటీటీలో ఆలస్యంగా విడుదల చేయాలని కూడా బోనీ సూచించారు.
