'దురంధర్'కి మంగళవారం దెబ్బ!
నిజానికి దురంధర్ కి అంత మంచి టాక్ లేకపోయినా కానీ, దర్శకుడి క్రేజ్ తో మొదటి వీకెండ్ 100కోట్లు సునాయాసంగా ఆర్జించింది.
By: Sivaji Kontham | 8 Dec 2025 10:41 PM ISTఏదైనా క్రేజ్ ఉన్న తెలుగు సినిమా విడుదలవుతోంది అంటే మొదటి వారం టికెట్ ధరల్ని చుక్కల్లోకి తీసుకెళుతున్నారు. దానికి భిన్నంగా ఇటీవలి కాలంలో కొన్ని బాలీవుడ్ సినిమాలకు టికెట్ ధరల్ని అదుపులో ఉంచి, ప్రజలను థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. వారంలో కనీసం ఒకరోజైనా సగటు ప్రజలకు అందుబాటులో టికెట్ ధర ఉండాలని నిర్ణయించుకుని ఆరోజుకు రూ.99కే టికెట్ ని అమ్ముతున్నారు. ప్రతి మంగళవారం ఈ ధర అందుబాటులో ఉంటోంది.
హిందీ ట్రేడ్ సమాచారం ప్రకారం..ఏప్రిల్ నుండి మంగళవారం నాడు సినిమా థియేటర్లు రూ. 99, రూ. 149 లేదా రూ. 199 కి టిక్కెట్లు అమ్మడం ఆనవాయితీ. ఈ పథకం చాలా బాగా వర్కవుటైంది. ప్రతి మంగళవారం థియేటర్లలో హౌస్ ఫుల్ షోలు పడటం చూసాక పరిశ్రమలో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి.
అయితే ఇప్పుడు రణ్ వీర్ సింగ్ `దురంధర్`కి ఈ ఆప్షన్ లేకుండా తప్పు చేయబోతున్నారు. నిజానికి దురంధర్ కి అంత మంచి టాక్ లేకపోయినా కానీ, దర్శకుడి క్రేజ్ తో మొదటి వీకెండ్ 100కోట్లు సునాయాసంగా ఆర్జించింది. ఈ దూకుడును మరింతగా ఎన్ క్యాష్ చేసుకోవాలని పంపిణీదారులు భావిస్తున్నట్టు తెలిసింది. అయితే మంగళవారం నాడు టికెట్ ధరల్ని పెంచడం సరైన ఆలోచన కానే కాదు. అలా చేయడం ద్వారా ప్రజలు థియేటర్లలోకి రానివ్వకుండా తలుపులు మూసేయడమేనని భావిస్తున్నారు.
వారంలో ఒక రోజు రేటును తగ్గించడం చాలా విధాలుగా కలిసొస్తుంది. కానీ దురంధర్ నిర్మాతలు అత్యాశకు పోతున్నారు. ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చాయని పంపిణీ బృందం ఆదివారం నాడు ప్రకటించింది. కానీ ఏం లాభం? ఇప్పుడు మంగళవారం నాటి టికెట్ ధరను అమాంతం పెంచేసారు. ఇది నిజంగా దురంధర్ కి మేలు చేయదని విశ్లేషిస్తున్నారు.
గడిచిన ఏడున్నర నెలల్లో ఇప్పటివరకు రెండు పెద్ద సినిమాలు ధురంధర్ - రైడ్ 2, సితారే జమీన్ పర్ మాత్రమే మంగళవారం ఆఫర్ లేకుండా స్కిప్ కొట్టాయి. థామ, ఏక్ దీవానే కి దీవానియాత్ దీపావళి పండుగలకు అనుగుణంగా మంగళవారం విడుదలయ్యాయి. వీటికి మంగళవారం ఆఫర్ ఇవ్వలేదు. ఏప్రిల్ నుండి హౌస్ఫుల్ 5, వార్ 2, సైయారా, మహావతార్ నర్సింహ, కాంతారా: ఎ లెజెండ్ చాప్టర్ - 1, సన్నీ సంస్కారి కి తులసి కుమారి వంటి అన్ని పెద్ద సినిమాలు ప్రతి మంగళవారం డిస్కౌంట్తో టిక్కెట్లను అమ్మారు. సైయారా, మహావతార్ నరసింహ వంటి సినిమాలు ఓవర్ ప్లేస్ అవుతున్నా కానీ ఆయా సినిమాల నిర్మాతలు మంగళవారం డిస్కౌంట్ ఆఫర్ను ఎంచుకున్నారు. ఇటీవలి గుజరాతీ బ్లాక్బస్టర్ `లాలో - కృష్ణ సదా సహాయతే` పంపిణీదారులు సినిమా థియేటర్లను రూ. 99కి టిక్కెట్లు అమ్మవద్దని, కనీస ధర రూ. 149గా ఉంచాలని కోరారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన 5వ వారంలో మార్పులు చేయడం ఆశ్చర్యకరం. ఇప్పుడు రైడ్, తారే జమీన్ పార్ తరహాలోనే దురంధర్ టికెట్ లకు ఎలాంటి డిస్కౌంట్లు లేకుండా విక్రయిస్తున్నారు.
