టాలీవుడ్ విజనరీ దర్శకులపైనే బాలీవుడ్ హీరోల కన్ను
ఇప్పటికే అనౌన్స్ అయినవి, అలాగే చర్చల్లో ఉన్న మరికొన్ని క్రేజీ కాంబినేషన్ల వివరాలు పరిశీలిస్తే...
By: Sivaji Kontham | 7 March 2026 7:00 AM ISTటాలీవుడ్ దర్శకుల విజన్, మేకింగ్ స్టైల్కు ఫిదా అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు మన దర్శకులతో పని చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అనౌన్స్ అయినవి, అలాగే చర్చల్లో ఉన్న మరికొన్ని క్రేజీ కాంబినేషన్ల వివరాలు పరిశీలిస్తే...
వరుణ్ ధావన్ - వెంకీ అట్లూరీ
రీసెంట్ గా `లక్కీ భాస్కర్`తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరీ.. బాలీవుడ్ యంగ్ స్టార్ వరుణ్ ధావన్తో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఇది ఒక ఎమోషనల్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని బాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
వెంకీ అట్లూరి తన గత చిత్రాలైన `సార్`, `లక్కీ భాస్కర్` సినిమాలతో సామాజిక అంశాలను కమర్షియల్ హంగులతో ఎలా మెప్పించవచ్చో నిరూపించారు. ఇప్పుడు వరుణ్ ధావన్తో చేయబోయే సినిమా కూడా ఇదే బాటలో సాగనుందని సమాచారం. ఇది కేవలం సాధారణ ఎమోషనల్ డ్రామా మాత్రమే కాకుండా, ఒక పీరియడ్ బ్యాక్డ్రాప్లో సాగే కథ అని తెలుస్తోంది. 1980 లేదా 90వ దశకం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఒక మధ్యతరగతి యువకుడి పోరాటాన్ని వెంకీ అట్లూరి ఆవిష్కరించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు కథనాలు ఇస్తున్నాయి.
వరుణ్ ధావన్ ప్రస్తుతం మాస్ యాక్షన్ సినిమాలపై దృష్టి పెట్టినా కానీ తనలోని నటుడిని సంతృప్తి పరిచే బద్లాపూర్, అక్టోబర్ వంటి కథల కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరి చెప్పిన పాయింట్ ఆయనకు బాగా నచ్చిందని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ .. ఒక బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ సంయుక్తంగా నిర్మించే అవకాశం ఉంది. ఈ సినిమాతో వెంకీ అట్లూరి నేరుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టడమే కాకుండా.. సౌత్ మేకింగ్ స్టైల్ను హిందీ నేటివిటీకి అన్వయించి ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమాను అందించబోతున్నారు.
షారూఖ్ ఖాన్ - సందీప్ రెడ్డి వంగా
కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయని.. ఒక పవర్ ఫుల్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను షారూఖ్ కోసం సందీప్ సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది గనుక ఓకే అయితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అలాగే `యానిమల్`తో రణ్బీర్ కెరీర్ను పీక్స్కు తీసుకెళ్లిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు దీనికి సీక్వెల్ `యానిమల్ పార్క్` కోసం రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో రణ్బీర్ డ్యూయల్ రోల్లో కనిపిస్తారని.. మొదటి భాగం కంటే పదింతలు వైల్డ్గా ఉంటుందని టాక్. రణ్బీర్ ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సల్మాన్ ఖాన్ - రాజ్ అండ్ డీకే
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ను ఒక భారీ సూపర్ హీరో సబ్జెక్టుతో ఆవిష్కరించేందుకు రాజ్ అండ్ డీకే సిద్ధమయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని.. సల్మాన్ను గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక కొత్త డైమెన్షన్లో చూపించబోతున్నారని సమాచారం. ఇది సల్మాన్ కెరీర్లోనే అత్యంత కాస్ట్ లీ మూవీగా నిలవనుంది.
జాన్ అబ్రహం - సుజీత్
పవన్ కళ్యాణ్ `ఓజీ`లో ఇమ్రాన్ హష్మీని విలన్గా చూపించిన సుజీత్.. తన తదుపరి భారీ ప్రాజెక్టు కోసం `జాన్ అబ్రహం`తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఒక హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ను సుజీత్ ప్లాన్ చేస్తున్నారు. జాన్ అబ్రహాం ఇప్పటివరకూ హిందీ పరిశ్రమకే పరిమితమయ్యాడు. ఇప్పుడు మొదటిసారి సౌత్ దర్శకులతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. సుజీత్ తన తదుపరి చిత్రం నానీతో పూర్తి చేసాక జాన్ అబ్రహాం ప్రాజెక్ట్ పైనా దృష్టి సారిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రణ్ వీర్ సింగ్- ప్రశాంత్ వర్మ
`హనుమాన్` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన `ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్` (PVCU) ను మరింత విస్తరిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్తో `రాక్షస్`అనే ప్రాజెక్టు కోసం చర్చలు జరిగాయి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనా కానీ, రణ్వీర్ సింగ్ను ఒక మైథలాజికల్ టచ్ ఉన్న పవర్ఫుల్ రోల్లో చూపించేందుకు ప్రశాంత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం సినిమాను కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారనే ప్రచారం ఉంది.
సల్మాన్ ఖాన్- వంశీ పైడిపల్లి
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరియు టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. పింక్విల్లా కథనం ప్రకారం.. ఇది ఒక భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ అని, ఇందులో సల్మాన్ ఖాన్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతార్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి మార్కు ఎమోషన్స్, స్టైలిష్ యాక్షన్ కలగలిసి ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించేందుకు దిల్ రాజు భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్ 2026 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ పనులను తుది దశకు చేర్చినట్లు... సల్మాన్ ఇమేజ్కు తగినట్లుగా పవర్ఫుల్ డైలాగులు, ఎలివేషన్లతో కూడిన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారసుడు వంటి హిట్ తర్వాత వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమా కావడం.. అది కూడా సల్మాన్ ఖాన్ వంటి పెద్ద హీరోతో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా పైడిపల్లి- దిల్ రాజు జోడీ బాలీవుడ్లో తమ ముద్రను మరింత బలంగా వేయాలని ప్లాన్ చేస్తున్నారు.
