100 కోట్లు అంతకుమించి.. టాప్ స్టార్ల సొంత విల్లాల కథలు
ముంబై టు హైదరాబాద్ చాలా మంది అగ్ర హీరోలు భారీగా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 29 Aug 2025 10:02 AM ISTముంబై టు హైదరాబాద్ చాలా మంది అగ్ర హీరోలు భారీగా రియల్ ఎస్టేట్ పై పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. తమ సంపాదనను వేగంగా ఎదిగే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సెలబ్రిటీలు ఎప్పుడూ ఉత్సాహంగా ఉన్నారు. అంతేకాదు.. తమ స్టాటస్ సింబల్ గా భావించే సొంత బంగ్లా లేదా ఖరీదైన కార్లపైనా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం... హిందీ స్టార్లు తమ సొంత నివాసాల కోసం ఏకంగా 100కోట్లు అంతకుమించి బడ్జెట్లను ఖర్చు చేయడం ఇటీవల చర్చకు వచ్చింది.
ఇప్పటివరకూ ముంబైలో అత్యంత ఖరీదైన భవంతి ఏ సెలబ్రిటీ కపుల్ సొంతం అంటే... అది కచ్ఛితంగా కపూర్ వంశపు రాకుమారుడు, ప్రముఖ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ జంట సొంతం. భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన సెలబ్రిటీ నివాసాలలో ఒకటి ముంబైలోని అందమైన `కృష్ణ రాజ్ బంగ్లా`కు యజమానులు వీరు. ఈ భవంతిని తమ కుమార్తె రాహా కపూర్ కు కానుకగా ఇచ్చేస్తున్నామని రణ్బీర్ కపూర్ ప్రకటించారు. పూర్వీకుల ఆస్తికి ఇప్పుడు ఏడాది వయసున్న రాహా కపూర్ యజమాని. సుమారు రూ. 250 కోట్ల బడ్జెట్ తో ఈ భవంతిని నిర్మించారు. ఇటీవల ఈ భవనానికి సంబంధించిన వీడియో ఒకటి అంతర్జాలంలోకి విడుదల కాగా జెట్ స్పీడ్ తో వైరల్ అయింది. ఈ భారీ మల్టీస్టోరీడ్ భవంతిలో పెద్ద గదులు, పచ్చని తోటలు, అద్భుతమైన భద్రత ప్రధానంగా హైలైట్. ఈ ఇంటిని అధికారికంగా లాంచ్ చేసేవరకూ, ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయొద్దని ఆలియా మీడియాను కోరారు.
ఆ తర్వాత అత్యంత ఖరీదైన సెలబ్రిటీ భవంతి షారుఖ్ ఖాన్ - మన్నత్. ముంబై బాంద్రాలో ఉన్న మన్నత్ విలువ దాదాపు రూ. 200 కోట్లు. ఆరు అంతస్తుల విలాసవంతమైన భవంతిలో అద్భుతమైన ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో షారూఖ్ కి ఒక ప్రైవేట్ కార్యాలయం కూడా ఉంది. క్లాసిక్ డే రాజభవనాన్ని తలపించే మన్నత్ ముంబై బాంద్రాలో టూరిస్టులను ఆకర్షించే అత్యంత ఆకర్షణీయమైన స్పాట్ లలో ఒకటి. ప్రస్తుతం మన్నత్ ని కొన్ని ఎకరాల్లో విస్తరిస్తూ దాదాపు మరో 200కోట్ల అదనంగా షారూఖ్ ఖర్చు చేస్తున్నారని టాక్ ఉంది. ఇది పూర్తయితే షారూఖ్ సొంత ఇంటి విలువ సుమారు 400 కోట్లు పైమాటేనని అంచనా.
ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ - జల్సా ధర దాదాపు రూ. 120 కోట్లు. జుహులోని అమితాబ్ బచ్చన్ నివాసం అయిన `జల్సా` రెండంతస్తుల బంగ్లా. ఇక్కడ అమితాబ్ తన అభిమానులను నిరంతరం కలుస్తుంటారు. ఈ భవంతి వద్దనే రెగ్యులర్ గా ఫ్యామిలీ సమావేశాలు, మీడియా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయని హిందీ మీడియా పేర్కొంది. అద్భుతమైన ఫర్నీచర్, ఇంటీరియర్స్ తో పాటు అందమైన స్విమ్మింగ్ పూల్ తో బంగ్లా ఆకట్టుకుంటుంది.
రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే జంట బ్యూమాండే టవర్స్ లో నివసిస్తున్నారు. ఈ భారీ భవంతి ఖరీదు రూ. 119 కోట్లు. ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్లో డిజైనర్ ఇంటీరియర్లు, సీ ఫేసింగ్ లో అద్భుతమైన వ్యూతో ఆకట్టుకుంటుంది. దీపిక, రణబీర్ తమ అభిరుచి మేరకు ఇంటీరియర్స్ ని అద్భుతంగా డిజైన్ చేయించుకున్నారు.
శిల్పా శెట్టి - రాజ్ కుంద్రా జంట నివశించే `కినారా` భవంతి విలువ రూ. 100 కోట్లు. జుహూలో సీఫేసింగ్ లో ఈ భవంతి కొలువు దీరి ఉంది. అత్యంత విలాసవంతంగా అలంకరించిన ఇంటీరియర్స్, వింటేజ్ ఆర్ట్ వర్క్ తో ఒక అందమైన రిసార్ట్ ని తలపిస్తుంది. ఈ అందమైన జంట అభిరుచికి ప్రతిరూపంగా `కినరా` లగ్జరీ లుక్ తో ఆకర్షిస్తుంది.
సీనియర్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ - గెలాక్సీ అపార్ట్మెంట్స్ ఖరీదు రూ. 100 కోట్లు. దశాబ్ధాలుగా సల్మాన్, అతడి కుటుంబం గ్యాలాక్సీ అపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. సల్మాన్ నివశించేది ఒక చిన్న సింగిల్ బెడ్ రూమ్ అయినా కానీ అతడి కుటుంబం భారీ స్పేస్ ఉన్న అపార్ట్ మెంట్ లో అదే భవంతిలో నివశిస్తుంది. ఈ భవంతి వద్దకు సల్మాన్ ని చూడటానికి అభిమానులు విచ్చేస్తుంటారు. ఇది భారీ భవంతి కాదు కానీ, సల్మాన్ కి సెంటిమెంట్ గా వచ్చిన ఇల్లు కావడంతో ఇది అతడికి అన్నివేళలా ఓదార్పునిస్తుంది. అతడి సెంటిమెంట్ కి ఇది ప్రతిబింబంగా కనిపిస్తుంది.
టాలీవుడ్ స్టార్ల విలాసాలు:
వంద కోట్లు అంతకుమించిన బడ్జెట్లతో నివాసాలు నిర్మించుకున్న అగ్ర తారల్లో టాలీవుడ్ తారలు ఉన్నారు. ఇందులో పరిశ్రమ మూల స్థంబాలు అయిన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఉన్నారు. టాలీవుడ్ లో అత్యంత ధనికుడైన కథానాయకుడిగా అక్కినేని నటవారసుడు నాగార్జున రికార్డులకెక్కగా, కేవలం స్వయంకృషితో ఇంతింతై ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి స్వార్జితం గురించి నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతుంది. నటవారసుడు నందమూరి బాలకృష్ణ, స్టూడియో యజమాని అగ్ర నిర్మాత రామానాయుడు వారసుడిగా విక్టరీ వెంకటేష్, డా.మంచు మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి ప్రముఖులు విలాసవంతమైన సొంత గృహాలను కలిగి ఉన్నారు.
