పెళ్లైన ఐదు నెలలకే పెటాకులైన పెళ్లి!
ఈ వార్తలకు చెక్ పెడుతూ బాద్షా -ఈషా రికీ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒకే విధమైన ప్రకటనను షేర్ చేశారు.
By: Srikanth Kontham | 1 Sept 2026 2:01 PM ISTసంగీత ప్రపంచంలో తనదైన ర్యాప్తో ప్రజాదరణ పొందిన పాపులర్ గాయకుడు బాద్షా వ్యక్తిగత జీవితం మళ్లీ వార్తల్లో నిలిచింది. పంజాబీ నటి ఈషా రికీ ని వివాహం చేసుకున్న కొన్ని నెలలకే వారిద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి షాక్ ఇచ్చారు. వివాహమైన ఐదు నెలల వ్యవధిలోనే పరస్పర అంగీకారంతో వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొన్ని వారాలుగా ఇద్దరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తాయని, త్వరలోనే విడిపోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు షికారు చేశాయి.
ఈ వార్తలకు చెక్ పెడుతూ బాద్షా -ఈషా రికీ ఇద్దరూ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒకే విధమైన ప్రకటనను షేర్ చేశారు. `నేను, ఈషా రికీ పరస్పరం గౌరవప్రదంగా చర్చించుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై మా వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తాం` అని స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని మీడియాను, అభిమానులను ఈజోడీ విజ్ఞప్తి చేసింది. `ఈ విషయంపై మా వైపు నుంచి వచ్చే ఏకైక ప్రకటన ఇదే. మా బంధంపై ఇకపై ఎలాంటి అనవసరపు ఊహాగానాలు, అంచనాలు వేయవద్దని కోరుతున్నాం` అని అన్నారు.
నాలుగు సంవత్సరాల పాటు సీక్రెట్గా డేటింగ్ చేసిన తర్వాత ఈ జోడీ ఇదే ఏడాది మార్చిలో సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వాస్తవానికి జూలై నెల నుంచే ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం మొదలైంది. ఈషా రికీ సోషల్ మీడియాలో `కొన్ని యుద్ధాలు శరీరానికి బయటకు కనిపించని లోతైన గాయాలను మిగులుస్తాయి` అంటూ పెట్టిన పోస్టు నెటిజన్లలో పలు అనుమానాలను రేకెత్తించాయి. అదే సమయంలో ఆమె తల్లి కూడా కర్మ గురించి చేసిన పోస్టులు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాం శమయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే విడాకుల ప్రకటన వెలువడటం గమనార్హం.
రాపర్ బాద్షాకి ఇది రెండో విడాకులు. గతంలో 2012లో జాస్మిన్ మసీహ్ను వివాహం చేసుకోగా వారికి జెస్సేమీ గ్రేస్ అనే కుమార్తె జన్మించింది. మనస్పర్థల కారణంగా 2020లో విడాకులు తీసుకున్నారు. కుమార్తె బాధ్యతలను కలిసి చూసుకుంటున్న తరుణంలో ఈషా రికీతో రెండో పెళ్లి చేసుకున్నా? ఆ బంధం కూడా ఐదు నెలలకే పరిమితం అవ్వడం అభిమానుల్ని బాధిస్తోంది.
