Begin typing your search above and press return to search.

బాహుబలి : ఆ పిచ్చి మళ్లీ మొదలైంది!

ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో రూపొందిన బాహుబలి గురించి పదేళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం.

By:  Ramesh Palla   |   25 Oct 2025 4:04 PM IST
బాహుబలి : ఆ పిచ్చి మళ్లీ మొదలైంది!
X

ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో రూపొందిన బాహుబలి గురించి పదేళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఆ సినిమా సాధించిన వసూళ్లు, ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర, రానా విలనిజం, రాజమౌళి డైరెక్షన్‌, అనుష్క బ్యూటీ అండ్ యాక్షన్‌, తమన్నా బ్యూటీ ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌... ఇలా సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ గురించి ఈ పదేళ్లుగా మాట్లాడుకుంటూనే ఉన్నాం. బాహుబలి మొదటి పార్ట్‌ విడుదల అయ్యి 10 ఏళ్లు అవుతుంది. అయితే అంతకు ముందు మూడు నాలుగు ఏళ్లు బాహుబలి గురించిన ముచ్చట్లు మీడియాలో చూస్తూనే వచ్చారు. సోషల్‌ మీడియాలో బాహుబలి గురించి అంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా పుకార్లు, ప్రచారం ను తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా జాతీయ మీడియా సైతం చూసింది. ఆ స్థాయిలో బాహుబలి గురించి అప్పుడు ప్రచారం జరిగింది, ఇప్పటి వరకు ఏదో విషయం గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు మళ్లీ బాహుబలి ఫీవర్ మొదలైంది.

బాహుబలి : ది ఎపిక్‌ ట్రైలర్ రిలీజ్‌

2015లో విడుదలైన బాహుబలి : ది బిగినింగ్‌, 2017లో విడుదలైన బాహుబలి : ది కంక్లూజన్‌లను కలిపి 2025లో బాహుబలి : ది ఎపిక్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెండు పార్ట్‌లను కలిపి దాదాపుగా మూడున్నర గంటల పాటు ఎడిట్‌ చేశారట. ఇటీవల ది ఎపిక్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. రాజమౌళి మార్క్ మళ్లీ కనిపించింది. కొత్త సినిమా చూస్తామా అన్న ఫీల్‌ కచ్చితంగా బాహుబలి ది ఎపిక్‌ ట్రైలర్ కలిగించింది అంటూ విశ్లేషకులు, ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ బాహుబలి కోసం ప్రేక్షకులు ఎదురు చూసే విధంగా ట్రైలర్‌ కట్‌ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, రాజమౌళి ఈ రీ ఎడిట్‌ కి, రీ రిలీజ్ కి సైతం కాస్త ఎక్కువగానే శ్రద్ద పెట్టి వర్క్ చేసినట్లుగా ఉన్నాడు. అందుకే ఆయన మార్క్ క్లీయర్‌గా కనిపించబోతుందని మేకర్స్ బలంగా చెబుతున్నారు.

ప్రభాస్‌, రాజమౌళి మరోసారి

ఈ రీ రిలీజ్ కోసం రాజమౌళితో పాటు ప్రభాస్‌, రానా ఒక ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అనుష్క సైతం ఏదో ఒక రూపంలో బాహుబలి : ది ఎపిక్‌ ప్రమోషన్‌లో పాల్గొనబోతుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కాబోతుంది. దీన్ని చాలా మంది రీ రిలీజ్‌ అని కాకుండా బాహుబలి కొత్తగా మళ్లీ రాబోతుంది అన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే 2015, 2017లో ఎలా అయితే బాహుబలి పిచ్చితో ప్రేక్షకులు, నెటిజన్స్ సోషల్‌ మీడియాలో ఊగి పోయారో ఇప్పుడు అలాగే బాహుబలి : ది ఎపిక్‌ గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. బాహుబలి పిచ్చితో మరోసారి తెలుగు ప్రేక్షకుల మాత్రమే కాకుండా ఇండియన్‌ ప్రేక్షకులు ఊగి పోతున్నారు. అక్టోబర్‌ 31న విడుదల కాబోతున్న బాహుబలి : ది ఎపిక్‌ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌ నెంబర్స్‌ చూస్తూ ఉంటే మతి పోతుంది.

బాహుబలి అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డ్‌

హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో ప్రతి షో కి అప్పుడే దాదాపుగా ఫుల్‌ అవుతున్నాయి. బుకింగ్‌ ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే వేలల్లో టికెట్లు అమ్ముడు పోయాయి. సినిమా విడుదల సమయంకు ఈ బుకింగ్‌ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏకంగా బుకింగ్‌ మై షో లో ట్రెండ్‌ అవుతోంది. గంటకు మూడు నాలుగు వేల టికెట్ల చొప్పున బుక్ కావడంతో బాహుబలి : ది ఎపిక్‌ సరికొత్త రికార్డ్‌ను నమోదు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదని విశ్లేషకులు అంటున్నారు.

ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ రీ రిలీజ్ లో చూడని నెంబర్స్‌ను ఈ సినిమా చూడబోతుందని, అంతే కాకుండా స్టార్‌ హీరోల సినిమాలు మొదటి సారి విడుదల అయినప్పుడు వచ్చిన వసూళ్లను కూడా ఈ సినిమా బ్రేక్‌ చేయబోతుందనే విశ్వాసంను ప్రభాస్ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నవంబర్‌ నెల మొత్తం బాహుబలి పిచ్చితో ఇండియన్‌ సినీ ప్రేక్షకులు ఊగి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.