ఏపీ సినీపరిశ్రమపై ఏప్రిల్లో కీలక నిర్ణయం?
అసలు ఆంద్రప్రదేశ్ కు సినీపరిశ్రమ తరలి వస్తుందా? హైదరాబాద్ నుంచి కదిలి వస్తుందా? ఈ ప్రశ్నలకు చాలా కాలంగా సమాధానం లేదు.
By: Sivaji Kontham | 4 Feb 2026 8:58 AM ISTఅసలు ఆంద్రప్రదేశ్ కు సినీపరిశ్రమ తరలి వస్తుందా? హైదరాబాద్ నుంచి కదిలి వస్తుందా? ఈ ప్రశ్నలకు చాలా కాలంగా సమాధానం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త సినీపరిశ్రమ నెలకొల్పుతామని తెలుగు దేశం పెద్దలు పదే పదే ప్రకటిస్తున్నా కానీ, పనులు శూన్యం అనే నిరాశ ఉంది. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ కీలక ప్రకటన చేశారు. ఈ రోజు (ఫిబ్రవరి 3) జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం అభివృద్ధికి ఏప్రిల్ నుంచి ఒక ప్రత్యేక కార్యచరణను ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు.
అంతేకాకుండా సుమారు 12 ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను తిరిగి ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఉగాది (మార్చి లేదా ఏప్రిల్) నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి ముఖ్యమంత్రిని సంప్రదించడానికి సన్నాహకాలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
సినిమాతో పాటు నాటక రంగాన్ని కూడా సమానంగా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా నాటకాల ప్రదర్శనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్.ఎస్.డి) బ్రాంచ్ను తీసుకువచ్చేందుకు కేంద్రంతో చర్చలు జరుపుతున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తెలిపారు.
హైదరాబాద్కు ధీటుగా అమరావతి, విశాఖపట్నంలను సినిమా రంగానికి కేంద్రబిందువులుగా మార్చడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఏపీలో షూటింగ్లు జరుపుకునే చిత్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నామని తెలిపారు.
స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్, రీ-రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ఒక సమగ్రమైన సినిమా టూరిజం పాలసీని తీసుకురాబోతున్నామని వెల్లడించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 విజేతలను మంత్రి సత్కరించారు. ఇది యువ ప్రతిభను గుర్తించే దిశగా ఒక అడుగు. మంత్రి నిర్ణయాలతో ఏపీలో మళ్లీ షూటింగ్ల సందడి పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
