థియేటర్ల గొడవ.. అన్నపూర్ణ స్టూడియోస్ క్లారిటీ
ముందుగా ఎగ్జిబిటర్ల సంఘం తరఫున శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ఇకపై అద్దె విధానానికి ఒప్పుకునేది లేదని, పర్సంటేజీ ఇస్తేనే సింగిల్ స్క్రీన్లలో సినిమాలను రిలీజ్ చేస్తామని అల్టిమేటం విధించగా
By: Garuda Media | 15 May 2026 12:42 PM ISTతెలుగు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ముందుగా ఎగ్జిబిటర్ల సంఘం తరఫున శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ఇకపై అద్దె విధానానికి ఒప్పుకునేది లేదని, పర్సంటేజీ ఇస్తేనే సింగిల్ స్క్రీన్లలో సినిమాలను రిలీజ్ చేస్తామని అల్టిమేటం విధించగా.. దీనిపై నిర్మాతలు ససేమిరా అంటూ కౌంటర్ ఎటాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తోంది. ఇంతలో ఇప్పుడు థియేటర్ల యజమానులు కొందరు ఒక ప్రెస్ మీట్ పెట్టారు.
మొదట ప్రెస్ మీట్ పెట్టిన వాళ్లందరూ లీజు మీద థియేటర్లు నడుపుతున్న వారే అని, ఒరిజినల్ థియేటర్ ఓనర్లను వదిలేసి వీరిని బాగు చేయాలా అంటూ నిర్మాతలు మాట్లాడిన నేపథ్యంలో కొందరు ఎగ్జిబిటర్లు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక ఎగ్జిబిటర్ మాట్లాడుతూ.. సూర్య సినిమా వీరభద్రుడును అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పర్సంటేజీ విధానం ప్రకారమే రిలీజ్ చేస్తోందని.. తాము ఏం చెప్పినా దానికి ఓకే అందని పేర్కొన్నాడు.
అంతే కాక పెద్ది సినిమా తమ టార్గెట్ కాదని పేర్కొంటూ, ఆ సినిమా రెండు నెలలు ఆలస్యంగా వచ్చినా తాము ఇదే మాటకు కట్టుబడి ఉంటామని.. పర్సంటేజీ ఇవ్వలేదంటే హైదరాబాద్లోని 22 స్క్రీన్లు మాత్రమే కాక తెలంగాణలోని అన్ని సింగిల్ స్క్రీన్లలోనూ పెద్ది సినిమాను ప్రదర్శించబోమని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. తాము పర్సంటేజీ విధానానికి సరే అన్నట్లుగా ఎగ్జిబిటర్లు చెప్పడంతో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ లైన్లోకి వచ్చింది.
ఆ ప్రచారం నిజం కాదని తేల్చేసింది. తాము ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విధానాలకు కట్టుబడి ఉంటామని.. ఎన్నో ఏళ్లుగా తమ విధానం ఇదే అని, ఇంతకుముందు కూడా ఇలాగే ఉంటుందని అన్నపూర్ణ సంస్థ స్పష్టం చేసింది. తద్వారా వీరభద్రుడు సినిమా విషయంలో తాము పర్సంటేజీ విధానానికి అంగీకరించినట్లు వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. అన్నపూర్ణ వారు ఇంత స్పష్టతతో ఉన్నపుడు ఎగ్జిబిటర్లు అలా ఎందుకు చెప్పారో మరి?
