Begin typing your search above and press return to search.

ప్రజల తీర్పు తర్వాతే అనకాపల్లి విడుదల.. కొత్త నిర్ణయం తీసుకున్న చిత్ర బృందం

హీరో విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన అనకాపల్లి సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారం ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   5 Aug 2026 10:27 PM IST
ప్రజల తీర్పు తర్వాతే అనకాపల్లి విడుదల.. కొత్త నిర్ణయం తీసుకున్న చిత్ర బృందం
X

హీరో విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన అనకాపల్లి సినిమా ముందుగా ప్రకటించిన ప్రకారం ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని వాయిదా వేయాలని నిర్ణయించింది. సినిమాకు వస్తున్న మంచి స్పందన, కొత్త అవకాశాలు ఈ నిర్ణయానికి కారణమని తెలిపింది.

ఇటీవల ఈ సినిమాకు ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్ల కోసం ఒక షో నిర్వహించారు. సినిమా చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు కథ, భావోద్వేగాలు, ప్రెజెంటేషన్ బాగా నచ్చాయని చెప్పారు. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని సూచించారు.

అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నాయని సమాచారం. దీంతో తొందరగా విడుదల చేయడం కంటే అన్ని అవకాశాలను పరిశీలించి, మరింత విస్తృత స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు.

అయితే ఈ సినిమా విషయంలో చిత్ర బృందం ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. థియేటర్లలో విడుదలకు ముందు అనకాపల్లి పట్టణంలోనే 4 నుంచి 5 ప్రత్యేక పబ్లిక్ షోలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ షోలు సినీ ప్రముఖులు లేదా ఇండస్ట్రీ సభ్యుల కోసం కాదు. పూర్తిగా సాధారణ ప్రేక్షకుల కోసం మాత్రమే ఏర్పాటు చేయనున్నారు.

సినిమా పేరు అనకాపల్లి కావడం, కథ కూడా అదే ప్రాంతానికి సంబంధించినది కావడం, నిర్మాత కూడా అనకాపల్లికి చెందిన వ్యక్తి కావడంతో ముందుగా అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని బృందం భావించింది. ప్రేక్షకులు సినిమా చూసి నిజాయితీగా తమ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతోంది.

ప్రపంచ సినీ పరిశ్రమలో కొన్ని సినిమాలు ముందుగా ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ప్రేక్షకుల స్పందన తెలుసుకుని తర్వాత భారీ స్థాయిలో విడుదల అవుతుంటాయి. అదే తరహాలో తెలుగులో కూడా కొత్త ప్రయత్నంగా ముందు ప్రజల తీర్పు.. తర్వాతే విడుదల అనే విధానాన్ని అనకాపల్లి టీమ్ అమలు చేస్తోంది.

డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సానుకూల స్పందన, ఓటీటీ సంస్థల ఆసక్తి, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు, అలాగే అనకాపల్లి ప్రజల అభిప్రాయం ఆధారంగా కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే ముందుగా ప్రేక్షకుల తీర్పుకే ప్రాధాన్యం ఇస్తున్నామని నిర్మాతలు స్పష్టం చేశారు. కొత్త విడుదల తేదీని ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.