AA24 పై ముంబైలో మైండ్ బ్లాకింగ్ ప్లాన్!
ఐకాన్ స్లార్ అల్లు అర్జున్ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెప్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సన్నహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 15 Sept 2026 1:00 AM ISTఐకాన్ స్లార్ అల్లు అర్జున్ మలయాళ దర్శకుడు బాసిల్ జోసెప్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సన్నహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. గతంలో మాల్దీవుల పర్యటన సమయంలోనే వార్త వెలుగులోకి వచ్చింది. అటుపై బన్నీ ఇంట స్పెషల్ ఈవెంట్ కు బాసిల్ అటెండ్ అవ్వడం ఆ ప్రచారాని మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు ముంబైలో మళ్లీ భేటీ కావడం ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ భేటీ కూడా అత్యంత గోప్యంగా జరగడంతో బన్నీ 24వ ప్రాజెక్ట్ కోసమేనని దాదాపు కన్పమ్ అవుతుంది.
ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ స్క్రీన్రైటర్ అరుణ్ అనిరుధన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. ముంబైలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయన If You Know, You Know అనే క్యాప్షన్ ఇచ్చారు. అరుణ్ అనిరుధన్ షేర్ చేసిన ఫోటోలలో బాసిల్ జోసెఫ్తో పాటు మరొక రచయిత పాల్సన్ స్కరియా కూడా ఉండటం గమనార్హం. మలయాళ పరిశ్రమకు చెందిన ప్రతిభావంతులైన కాంబినేషన్ ముంబైలో ల్యాండ్ అయి అల్లు అర్జున్తో సమావేశమవ్వడంపై నెటిజన్లు రకరకాల అంచనాలు వేస్తున్నారు.
పాన్-ఇండియా స్టార్గా మారకముందే కేరళలో మల్లు అర్జున్ గా ఐకాన్ స్టార్ సాధించిన భారీ ఫ్యాన్ బేస్ను గుర్తు చేసుకుంటున్నారు. `కేరళ కుర్రాళ్లు అల్లు అర్జున్తో కలిసి పెద్ద ప్లాన్ చేస్తున్నారు` అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ భేటీ వెనుక ఉన్న కథను విశ్లేషిస్తూ నెటిజన్లు అరుణ్ అనిరుధన్ క్లబ్ ఎఫ్ఎమ్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను రీకాల్ చేస్తున్నారు. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో భారీ స్థాయిలో శక్తిమాన్ సినిమా తెరకెక్కించడానికి తాను, పాల్సన్ స్కరియా కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేశామని అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇప్పుడు అదే రచయితల బృందం బాసిల్తో కలిసి ముంబైలో ప్రత్యక్షమవ్వడంతో అల్లు అర్జున్ కోసం భారీ ఐడియా తో సరికొత్త లార్జర్-ద్యాన్-లైఫ్ స్క్రిప్ట్తో ముందుకు వస్తున్నారని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస భారీ ప్రాజెక్ట్లతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో నటిస్తోన్న `రాకా` వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఇది పూర్తయిన వెంటనే? ఏ దర్శకుడితో సినిమా చేస్తారు? అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ తో ఇప్పటికే ప్రాజెక్ట్ లాక్ అయింది. తాజాగా బాసిల్ జోసెప్ కూడా తెరపైకి రావడం...వేగంగా జరుగుతోన్న చర్చలు చూస్తుంటే? లోకేష్ తో ముందుకెళ్తారా? బాసిల్ తో ముందుకెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
