టాలీవుడ్ పై మోజు పడుతున్న బాలీవుడ్ తారలు.. బడా ప్రాజెక్టులలో భాగం!
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో మెరిసిన ఆలియా భట్కు తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగింది.
By: Madhu Reddy | 4 Sept 2026 9:00 PM ISTఒకప్పుడు సౌత్ నటీనటులు బాలీవుడ్ వైపు చూసేవారు, కానీ ఇప్పుడు కాలం మారింది! మన టాలీవుడ్ సినిమాలు పాన్-ఇండియా రేంజ్లో రికార్డులు సృష్టిస్తుండటంతో, ఉత్తరాది భామలు తెలుగు ప్రాజెక్టులలో నటించడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తో సౌత్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఆలియా భట్, ఇప్పుడు మన టాలీవుడ్లోని అతిపెద్ద క్రేజీ సీక్వెల్స్ మరియు భారీ బడ్జెట్ సినిమాల్లో భాగమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ క్రేజీ వివరాలు చూద్దాం..
టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో ఆలియా భట్:
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో సీత పాత్రలో మెరిసిన ఆలియా భట్కు తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనే ఆసక్తి పెరిగింది. అందులో భాగంగానే రెబల్ స్టార్ ప్రభాస్ నటించబోయే 'కల్కి 2898 AD' సీక్వెల్లో దీపికా పదుకొణే స్థానంలో ఆలియాను ఎంపిక చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కాస్త ఆలస్యం కానుంది.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' లో ఆలియా?:
అంతేకాకుండా, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న అత్యంత భారీ ప్రాజెక్ట్ 'డ్రాగన్'లో కూడా ఆలియా భట్ ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రశాంత్ నీల్ టీమ్తో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే, సౌత్లో ఆలియాకు తిరుగులేని క్రేజ్ లభించడం ఖాయం.
బాలీవుడ్ భామలకు టాలీవుడ్ కేరాఫ్ అడ్రస్:
కేవలం అలియా భట్ మాత్రమే కాదు, బాలీవుడ్కు చెందిన పలువురు అగ్ర కథానాయికలు ప్రస్తుతం టాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో 'కల్కి 2898 AD' చిత్రంతో అలరించిన దీపికా పదుకొణె, ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'రాకా' లో నటిస్తోంది. మరోవైపు, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా కాంబోలో వచ్చిన పెద్ది మూవీ లో నటించి మెప్పించింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. బాలీవుడ్ భామలంతా మన సౌత్ బాక్సాఫీస్ క్రేజ్ చూసి తెలుగు చిత్రాలలో భాగమవుతూ ఇక్కడ జెండా పాతేస్తున్నారు..
జూన్ 2027 నాటికి 'డ్రాగన్' హంగామా:
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న 'డ్రాగన్' మూవీ షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభం కానుంది. ఈ సినిమాను జూన్ 2027 లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు ప్రభాస్ తన కమిట్మెంట్లు అయిన 'ఫౌజీ', సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' సినిమాలను పూర్తి చేసిన తర్వాతే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' సీక్వెల్ షూట్లో పాల్గొననున్నారు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో టాలీవుడే ప్రధాన కేంద్రంగా మారింది. మన దర్శకులు రాసుకుంటున్న కథలు, నిర్మాతలు పెడుతున్న భారీ బడ్జెట్లు బాలీవుడ్ బడా తారలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక ఆలియా భట్ వంటి స్టార్ హీరోయిన్లు వరుసగా తెలుగు పాన్-ఇండియా సినిమాలను ఒప్పుకోవడం, టాలీవుడ్ గ్లోబల్ రేంజ్ మరింత పెరిగిందనడానికి ఒక స్పష్టమైన నిదర్శనం..
