ఉప ఎన్నికలు వస్తే.. వైసీపీ గెలుస్తుందా?
ఏపీ అసెంబ్లీ 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు.. బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి.;
ఏపీ అసెంబ్లీ 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశాలు.. బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే.. ఈ సమావేశాలకు అయినా.. ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ ఎమ్మెల్యేలను రప్పించాలన్నది కూటమి నేతల వ్యూహం. ఇక, అసెంబ్లీ నిబంధనలు అంటూ.. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజులు.. కూడా వైసీపీ నేతలపై కన్నెర్ర చేస్తున్నారు. కేవలం హాజరు పుస్తకంలో సంతకాలు చేసి వెళ్లిపోతుండడాన్ని వారు తప్పుబడుతున్నారు.
ఈ క్రమంలోనే డిజిటల్ మాధ్యంలోనే హాజరు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిని బడ్జెట్ సమావేశాల్లో పక్కాగా అమలు చేయాలని కూడా భావిస్తున్నారు. ఇక, ఈ సమావేశాలకు కూడా తొలిరోజు వైసీపీ ఎమ్మెల్యే లు వచ్చినా.. తర్వాత నుంచి రాకుండా ఉండాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ హాజరు ను అమలు చేస్తున్నారు. ఒకవేళ వరుసగా 60 రోజలు పాటు సభకు రాకపోతే.. సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు ఆటోమేటిక్గానే పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే.. వైసీపికి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలపైనా అనర్హత పడుతుంది. అనంతరం.. ఉప ఎన్నికలు వస్తాయి. అనర్హత పడిన నాయకులు ఆరేళ్ల వరకు ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిబంధ న ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ తరఫున వేరే నేతలను బరిలో నిలపాల్సి ఉంటుంది. వాస్తవానికి అంత దూరం వరకు తెచ్చుకునే అవకాశం లేదు. ఒకవేళ అసెంబ్లీ స్పీకర్ అనర్హత నిర్ణయం తీసుకున్నా.. కోర్టులకు వెళ్లేందుకు వైసీపీ నేతలు నిర్ణయించుకున్నారు.
అయినప్పటికీ.. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత పడితే.. వచ్చే ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయం దక్కించు కుంటుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. 20 నెలలు గడిచిపోయినా.. వైసీపీపై ప్రజల్లో సానుకూలత రాలేదు. పైగా ఈ మధ్య రప్పా-రప్పా.. పార్టీగా కూడా వైసీపీ గుర్తింపు పొందింది. జగన్ కూడా వివాదాలకు మద్దతు ఇస్తున్నారన్న వాదన ఉంది. దీనికి తోడు.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం వెంటాడుతోంది. ఇన్ని వ్యతిరేకతలు ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చినా.. వైసీపీ విజయం దక్కించుకోవడం కష్టమనే వాదన వినిపిస్తోంది.