పహల్గం దాడి తీగలాగితే.. చైనాలో కదులుతోంది !
ఉగ్రవాదులు భారత్ పై ఎప్పుడు దాడి చేసినా.. ఆ దాడి మూలాలు భారత్ లోనే దొరికేవి. కానీ ఇప్పుడు ఆ మూలాలు చైనాతో లింక్ అయి ఉన్నాయి.;
ఉగ్రవాదులు భారత్ పై ఎప్పుడు దాడి చేసినా.. ఆ దాడి మూలాలు భారత్ లోనే దొరికేవి. కానీ ఇప్పుడు ఆ మూలాలు చైనాతో లింక్ అయి ఉన్నాయి. పహల్గం ఉగ్రదాడి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణ సందర్భంగా నెదర్లాండ్స్ లో తీగలాగితే చైనాలో డొంక కదిలేలా కనిపిస్తోంది. ఉగ్రదాడి వెనుక ఎవరి సహాయం ఉందన్న కీలక విషయం వెలుగులోకి రానుంది. అయితే విచారణలో చైనా సహకరిస్తుందా లేదా ? అన్నది ప్రశ్న.
కెమెరాలో కీలక విషయం..
పహల్గం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో దాదాపు 25 మంది పర్యాటకులు మరణించారు. దీనికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్ పై ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ దాడులకు కారకులైన వారిని మట్టుబెట్టింది. పహల్గంలో ఉగ్రదాడికి ముందే ఉగ్రవాదుల రెక్కీ, వారి కదలికలకు సంబంధించిన దృశ్యాలు `గోప్రో హీరో 12 బ్లాక్` లో నిక్షిప్తమయ్యాయి. ఈ విషయాన్ని విచారణలో ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ పరికరానికి సంబంధించి పూర్తీ సమాచారాన్ని సేకరించేందుకు చైనా ప్రభుత్వానికి లెటర్ రోగెటరీ పంపడానికి జమ్మూ కోర్టు ఎన్ఐఏకు అనుమతి ఇచ్చింది.
నెదర్లాండ్స్ లో మొదలు..
ఎన్ఐఏ మొదట నెదర్లాండ్స్ లో విచారణ మొదలు పెట్టింది. మొదట ఈ గోప్రో కెమెరా తయారీ కంపెనీని సంప్రదించింది. ఎవరికి అమ్మారు, వారి డీటైల్స్ ఏంటి , ఎలా అమ్మారు లాంటి సమాచారాన్ని సేకరించింది. గోప్రో కెమెరాను చైనాకు సంబంధించిన ఏఈ గ్రూప్ ఇంటర్నేషనల్ అనే డిస్ట్రిబ్యూటర్ సంస్థకు అమ్మినట్టు తెలిపింది. ఈ పరికరం 2024 జనవరి 30న చైనాలోని డాంగ్గువాన్ యాక్టివేట్ అయినట్టు ఎన్ఐఏ అధికారులకు సాంకేతిక ఆధారాలు లభించాయి. అయితే ఆ కెమెరా చేతులు ఎలా మారింది ?. ఎవరి వద్దకు వెళ్లింది ?. ఉగ్రవాదుల చేతులకు ఎలా వెళ్లిందన్న సమాచారం తమ వద్ద లేదని నెదర్లాండ్స్ కంపెనీ ఎన్ఐఏకు తెలిపింది.
చైనా కీలకం
ఇప్పుడు ఈ విచారణలో చైనా పాత్ర చాలా కీలకం. ఎవరు కొన్నారు ?. ఎవరికి ఇచ్చారు ? లాంటి సమాచారం కావాలంటే చైనా సహకరించాలి. చైనా సహకరిస్తే ఈ కేసులో మరింత కీలక విషయం వెలుగులోకి వస్తుంది. అయితే చైనా సహకరిస్తుందా ? అన్నది ప్రశ్నార్థకం. ఒకవేళ సహకరిస్తే చైనా పాత్ర ఏంటన్నది తెలుస్తుంది. దీని వెనుక ఎవరున్నది తెలుస్తుంది. సాంకేతిక సహాయం ఇచ్చిందెవరో వెలుగులోకి వస్తుంది. మరోవైపు చైనాకు పాకిస్థాన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో చైనా సహకరిస్తుందా అన్నది కీలక ప్రశ్న. చైనా సహకరించకపోతే చైనా పాత్రపైనా అనుమానాలు పెరుగుతాయి. వాస్తవంగా చైనాకు, భారత్ కు మధ్య సంబంధాలు పరిస్థితులను బట్టి మారుతాయి. అమెరికాతో ఇబ్బందులు ఉన్నప్పుడు చైనా భారత్ తో స్నేహంగా ఉండాలని చూస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్ తోనూ స్నేహంగా ఉంటూ భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. కాబట్టి పహల్గం కేసు విచారణలో చైనా సహకారం పరిస్థితిని బట్టి మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.