Begin typing your search above and press return to search.

800 కోట్ల MS ధోని కంపెనీ CEOలు ఎవ‌రో తెలుసా?

వ్యాపారాన్ని కుటుంబంలోనే ఉంచే వ్యూహాత్మక చర్యలో మహేంద్ర సింగ్ ధోనీ 2020లో సాక్షి ధోనీని... ఆమె తల్లి షీలా సింగ్‌ని ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ CEOలుగా నియమించారు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:30 PM GMT
800 కోట్ల MS ధోని కంపెనీ CEOలు ఎవ‌రో తెలుసా?
X

జార్ఖండ్ డైన‌మైట్.. ధనాధ‌న్ ధోనికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ గా మిస్ట‌ర్ కూల్ గా అత‌డు సుప‌రిచితుడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్తాన్ పై ఒక విధ్వంశ‌క‌ర ఇన్నింగ్స్ తో అత‌డి పేరు ఆరంగేట్ర‌మే మార్మోగింది. ఆ త‌ర్వాత భార‌త క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా ఎదిగాడు. అయితే ధోని ఒక సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించాడ‌నేది అంద‌రికీ తెలియ‌క‌పోవ‌చ్చు. అత‌డి జీవిత‌క‌థ కుటుంబ నేప‌థ్యం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. ఎం.ఎస్.ధోని : యాన్ అన్ టోల్డ్ స్టోరిలో అత‌డి జీవితం గురించి ఆట‌లో ప‌ట్టుద‌ల గురించి తెలుసుకుని స‌గ‌టు ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. ధోనిపై సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్. బ‌యోపిక్ నిర్మాత‌ల‌కు లాభాల పంట పండించింది.

అత‌డి ఆట కెరీర్ ఫామ్ న‌ల్లేరుపై న‌డ‌క‌లా సాగుతున్న క్ర‌మంలోనే ప్రేమించిన సాక్షిని పెళ్లాడాడు. అయితే సాక్షి సింగ్ ధోని తో క‌లిసి ఎం.ఎస్.ధోని త‌మ వ్యాపారాన్ని ఎలా విస్త‌రించారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. కుటుంబంలో అంతా స‌వ్యంగా సాగితే సంప‌ద‌ల సృష్టి ఎంత సులువుగా సాగుతుందో ఈ కుటుంబం ఒక పెద్ద స్ఫూర్తి.

సాక్షి సింగ్ ధోనీ వంద‌ల కోట్ల ఆస్తికి య‌జ‌మాని ఇప్పుడు. ఆమె తల్లి క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి అత్త అయిన షీలా సింగ్ కేవలం కుటుంబ సభ్యురాలు మాత్రమే కాదు, ధోనీ వ్యాపార కార్యక్రమాలలో కీలక వ్యక్తి. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, కంపెనీని విజయపథంలో నడిపించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.

వ్యాపారాన్ని కుటుంబంలోనే ఉంచే వ్యూహాత్మక చర్యలో మహేంద్ర సింగ్ ధోనీ 2020లో సాక్షి ధోనీని... ఆమె తల్లి షీలా సింగ్‌ని ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ CEOలుగా నియమించారు. ఈ నిర్ణయం ఫలవంతమైంది. ఈ ఇద్దరూ ప్రొడక్షన్ హౌస్‌కు నాయకత్వం వహించారు. కొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముఖ్యమైన మైలురాళ్లను సాధించడం వారి ఉమ్మడి నాయకత్వంలో విజయవంతమైన ఫార్ములా.

గతంలో తన భర్త ఆర్‌కె సింగ్ కనోయి గ్రూప్‌కు చెందిన 'బినాగురి టీ కంపెనీ'లో మహేంద్ర సింగ్ ధోని తండ్రితో కలిసి పని చేస్తున్నప్పుడు.. కేవ‌లం త‌న‌ ఇంటి వ్యవహారాలను నిర్వహించిన‌ షీలా సింగ్, ఆ త‌ర్వాత ధోని కంపెనీల‌కు సీఈఓగా మార‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఆమె తన పాత్రకు సజావుగా స‌రిపోయారు. షీలా కుమార్తె సాక్షితో పాటు, ఆమె ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ విస్తరణ, వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. షీలా సింగ్ , సాక్షి ధోనీల డైనమిక్ నాయకత్వంలో, ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ నికర ఆస్తుల‌ విలువ కేవలం నాలుగు సంవత్సరాలలో రూ. 800 కోట్లకు పెరిగింది. ధోని స‌తీమ‌ణి సాక్షి ప్రొడక్షన్ హౌస్‌లో మెజారిటీ వాటాను కలిగి ఉంది. వ్యాపారంలో కుటుంబ ప్రమేయాన్ని మరింత సుస్థిరం చేసారు.

ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మహేంద్ర సింగ్ ధోని విభిన్న వ్యాపార పోర్ట్‌ఫోలియోలో ఒక అంశం మాత్రమే. అతడి మొత్తం నికర ఆస్తుల‌ విలువ రూ. 1030 కోట్లుగా ఉంది. షీలా సింగ్ అధికారంలో ఉండటంతో, కంపెనీ అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇది స‌ఖ్య‌మైన‌ కుటుంబం వ్యవస్థాపక స్ఫూర్తిని విజయానికి ఆలంబ‌న‌ను నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.