Begin typing your search above and press return to search.

2024 ఎన్నిక‌ల వార్ కి సెల‌బ్రిటీలిలా సిద్దం!

దీంతో ఎన్నిక‌ల‌కు మ‌రోసారి గ్లామ‌ర్ తోడైన‌ట్లు అయింది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి గానీ..ఓసారి పోటీ చేసే వాళ్ల గురించి తెలుసుకుంటే...

By:  Tupaki Desk   |   2 May 2024 7:33 AM GMT
2024 ఎన్నిక‌ల వార్ కి సెల‌బ్రిటీలిలా  సిద్దం!
X

2024 ఎన్నిక‌ల్లో చాలా మంది సెల‌బ్రిటీలు వివిధ పార్టీల నుంచి ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. శాస‌న‌స‌భ‌..లోక్ స‌భ‌ల‌కు ప‌లువురు తార‌లు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు మ‌రోసారి గ్లామ‌ర్ తోడైన‌ట్లు అయింది. ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడిపోతారు? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి గానీ..ఓసారి పోటీ చేసే వాళ్ల గురించి తెలుసుకుంటే...

ప‌వ‌ర్ స్టార్... జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురం నియోజ‌క వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రెండు నియోజక వ‌ర్గాల్లో పోటీచేసిన ప‌వ‌న్ రెండు చోట్లా ఓడిమిపాలైన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈసారి పిఠాపురం నుంచి గెలుపు జెండా ఎగ‌రేయాల‌ని తీవ్రంగానే శ్ర‌మిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న త‌రుపున వ‌రుణ్ తేజ్ స‌హా ఇండ‌స్ట్రీ నుంచి ప‌లువురు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ప‌వ‌న్ పార్టీ నుంచి మిగ‌తా 20 చోట్లా బ‌రిలోకి దిగుతోన్న వారి త‌రుపున ప్ర‌చారం చేస్తున్నారు.

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమెను బీజేపీ బ‌రిలోకి దించింది. గ‌తంలో నరేంద్ర మోడీకి పలు సార్లు బహిరంగంగానే మద్దతు పలికిందామె. దీంతో ఆమెపై న‌మ్మ‌కంతో పోటీ బ‌రిలోకి దించుతున్నారు. ఆమెతో పాటు బాలీవుడ్ నుంచి మ‌రో నటుడు అరుణ్ గోవిల్ కూడా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. 'రామాయణం' సీరియల్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్న అరుణ్ గోవిల్ ఇటీవల విడుదలైన ఆర్టికల్ 370 సినిమాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత్రలో మెప్పించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే సీనియ‌ర్ న‌టి హేమా మాలిని మ‌ధుర నుంచి మూడ‌వ సారి పార్ల‌మెంట్ అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతున్నారు. ఇక మ‌ల‌యాళ న‌టుడు సురేష్ గోపీ కూడా ఇదే పార్టీ త‌రుపున త్రిసూర్ నియోజ‌క వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మ‌రో బాలీవుడ్ న‌టుడు గోవిందా శివ‌సేన పార్టీ నుంచి నార్గ్ వెస్ట్ ముంబై నుంచి బ‌రిలో ఉన్నారు. అలాగే సీనియ‌ర్ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా అస‌న్ సోల్ లోక్ స‌భ నుంచి టీఎంసీ టికెట్ పై పోటీ చేస్తున్నారు.

భోజ్‌పురి నటుడు రవి కిషన్ ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి రవి కిషన్ గెలిచారు. ప్రస్తుతం అదే స్థానం నుంచి మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక బుల్లి తెర నటి రూపాగంగూలీ కూడా తాజాగా బీజేపీలో చేరారు. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్'.. 'అనుపమ' సీరియల్స్ ద్వారా ఆమె బాగా పాపుల‌ర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ కు ముందు ఆమె బీజేపీ తీర్థం తీసుకోవ‌డం విశేషం.