Begin typing your search above and press return to search.

చెన్నై లో జ‌బ్బున ప‌డ్డ ద‌క్షిణాఫ్రికా జట్టు..!

By:  Tupaki Desk   |   10 Aug 2015 9:03 AM GMT
చెన్నై లో జ‌బ్బున ప‌డ్డ ద‌క్షిణాఫ్రికా జట్టు..!
X
విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు అనారోగ్యం మామూలే. వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు స‌రిపోక‌పోవ‌టం.. ఆహారం తేడా కొట్ట‌టం లాంటివి జ‌రుగుతుంటాయి. కానీ.. ఒక అంత‌ర్జాతీయ క్రికెట్ జ‌ట్టు లోని ప‌ది మంది స‌భ్యులు ఒకేసారి జ‌బ్బున ప‌డి.. ఆసుప‌త్రిలో ఆడ్మిట్ అయిన అరుదైన ప‌రిస్థితి.. చెన్నై లో చోటు చేసుకుంది.

భార‌త్‌ లో ముక్కోణ‌పు సిరీస్ ఆడుతున్న ద‌క్షిణాఫ్రికా ఏ జ‌ట్టు ప‌రిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. విషాహారం తిన‌టంతో ఈ జ‌ట్టులోని ప‌ది మంది స‌భ్యులు ఇప్పుడు చెన్నై అపోలో ఆసుప‌త్రి లో చికిత్స పొందుతున్నారు. వీరి అనారోగ్యానికి విషాహార‌మే కార‌ణంగా చెబుతున్నారు. శ‌నివారం రాత్రి వారు తీసుకున్న ఆహారం తేడా కొట్ట‌టంతో ఆదివారం ఉద‌యం నుంచి వారి ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారింది.

ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా అనారోగ్యం బారిన ప‌డ‌టంతో వీరిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వీరి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని చెబుతున్నారు. మొద‌ట ముగ్గురు ఆట‌గాళ్లు అనారోగ్యం బారిన ప‌డ‌గా.. ఆ త‌ర్వాత ఒక్కొక్క‌రుగా ముగ్గురు మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లి ఆసుప‌త్రుల్లో చేరారు. చివ‌ర‌కు సెంచ‌రీ సాధించిన ఓపెన‌ర్ డికాక్ సైతం ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చింది.

అంత‌ర్జాతీయ స్థాయి ఆట‌గాళ్ల‌కు అందించే బ‌స‌.. ఆహారం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు. మ‌రి.. జ‌ట్టు మొత్తాన్ని ఇంత భారీగా దెబ్బ తీసే ఆహారం ఏం తిన్నారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా స‌ఫారీ ఆట‌గాళ్లు అనారోగ్యంతో ఆసుప‌త్రుల పాలుకావ‌టంతో.. సోమ‌వారం ద‌క్షిణాఫ్రికా.. ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్‌ ను వాయిదా వేసి.. వారి స్థానంలో భార‌త్‌.. ఆసీస్‌ ల మ‌ధ్య మ్యాచ్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.