Begin typing your search above and press return to search.

శ్రీశాంతూ.. ఆట అంత వీజీ కాదు బాసూ!

By:  Tupaki Desk   |   27 July 2015 8:56 AM GMT
శ్రీశాంతూ.. ఆట అంత వీజీ కాదు బాసూ!
X
స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి ఢిల్లీ కోర్టు తనకు విముక్తి కల్పించడం ఆలస్యం.. శ్రీశాంత్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. మరుసటి రోజే తన ఇంటికి దగ్గర్లో ఉన్న మైదానానికి వెళ్లిపోయాడు. తన చిన్న నాటి కోచ్ ను పిలిపించుకుని సాధన ఆరంభించేశాడు. ఐతే కోర్టు కేసు నుంచి ఊరట దక్కినంత మాత్రాన త్వరలోనే వచ్చి మ్యాచ్ లు ఆడేద్దామనుకుంటే శ్రీశాంత్ ది అత్యాశే అయ్యేలా ఉంది. ఎందుకంటే కోర్టు దృష్టిలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా.. నిర్దోషిగా తేలి ఉండొచ్చు కానీ.. బోర్డు మాత్రం వాళ్లను దోషులుగానే చూస్తోంది. శ్రీశాంత్, చవాన్ ల మీద జీవిత కాల నిషేధం విధించిన బీసీసీఐ.. చండిలా మీద విచారణను పెండింగులో పెట్టిన సంగతి తెలిసిందే.

చట్టంలో లొసుగులు ఉండటం వల్లే శ్రీశాంత్ అండ్ కో కోర్టులో దోషులుగా తేలారని బీసీసీఐ గట్టిగా నమ్ముతోంది. ఎంకోకా చట్టం కింద శ్రీశాంత్, చవాన్, చండిలాలపై కేసులు పెట్టడం పెద్ద తప్పని.. ఆ చట్టం కింద అభియోగాలు రుజువు చేయడం చాలా కష్టమని.. అసలు మ్యాచ్ ఫిక్సింగ్ కు వ్యతిరేకంగా సరైన చట్టాలు లేవని బీసీసీఐ మాజీ అవినీతి నిరోధక అధికారి రవి సవాని అభిప్రాయపడుతున్నారు. పోలీసులు నిందితులపై 420 కేసు పెట్టారని.. కానీ వాళ్లు ఎవరిని మోసం చేశారనే ప్రశ్న కోర్టు అడిగి ఉంటుందని.. తమను శ్రీశాంత్, చండిలా, చవాన్ మోసం చేసినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నిలబడి ఉండదని ఆయన అన్నారు. కేసులో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లను చేర్చడం కూడా తప్పని.. వారికి క్రికెటర్లకు లింకులు ఉన్నట్లు నిరూపించడం కష్టమని ఆయనన్నారు.

మొత్తానికి పోలీసులు సరైన చట్టం లేకపోవడం, పోలీసుల తప్పిదం వల్లే శ్రీశాంత్ అండ్ కో బయటపడ్డారని ఆయన అభిప్రాయపడుతున్నారు. బీసీసీఐ అంతర్గత విచారణలో శ్రీశాంత్, చవాన్, చండిలా తప్పు చేసినట్లు స్పష్టంగా తేలిందని.. కోర్టులో కేసు నిలవనంత మాత్రాన వారిని నిర్దోషులుగా బోర్డు భావించదని.. వారిపై నిషేధం తొలగించే అవకాశమే లేదని ఆయనంటున్నారు. క్రికెటర్లు కోర్టుకెక్కితే అప్పుడు ఏం చేయాలన్నది బోర్డు ఆలోచిస్తుందని.. అంతే తప్ప కేసు కొట్టేశారు కాబట్టి నిషేధం తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. కాబట్టి శ్రీశాంత్ ప్రాక్టీస్ అదీ మొదలుపెట్టేసి.. అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన పని లేదని తెలుస్తోంది.