Begin typing your search above and press return to search.

గోపీచంద్ పై గుత్తా జ్వాల గెలుపు

By:  Tupaki Desk   |   18 July 2015 7:09 AM GMT
గోపీచంద్ పై గుత్తా జ్వాల గెలుపు
X
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల పోరాటం ఫలించింది. బాడ్మింటన్ సమాఖ్య, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ లపై వరుస విమర్శలు గుప్పించిన జ్వాల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశారు. మెరుగ్గా రాణిస్తున్న తమకు ఏమాత్రం ప్రాధాన్యం కల్పించకపోగా, అంతంతమాత్రంగా ఆడుతున్నవారికి అంతర్జాతీయ టోర్నీల్లో ప్రాధాన్యం లభిస్తోందని గుత్తా జ్వాల ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. గుత్తా జ్వాల ఆరోపణల నేపథ్యంలో మొత్తం పరిస్థితిపై సమీక్ష జరిపిన బాడ్మింటన్ సమాఖ్య... గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పల జోడీకి రియో ఒలింపిక్స్ టాప్ స్కీం జాబితాలో చోటు కల్పించింది. తద్వారా ఒలింపిక్స్ లో జ్వాల, పొన్నప్పల ఖర్చులను భరించేందుకు బాడ్మింటన్ సమాఖ్య సంసిద్ధత వ్యక్తం చేసినట్లైంది.

క్రీడా మంత్రిత్వ శాఖ, భారత బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ గోపీచంద్ తో గుత్తా జ్వాల చాలానెలలుగా గొడవపడుతున్నారు. ఈ విషయం తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా ఆమె తీసుకెళ్లారు. జ్వాల ఈ విషయాన్ని కేసీఆర్ కు తెలిపిన తరువాత ఆయన ప్రధాని మోడీకి లేఖ కూడా రాశారు. టార్గెట్ ఒలింపిక్ పోడియంలోకి జ్వాల, అశ్విని పొన్నప్పలను తీసుకోవాలని ఆ లేఖలో ఆయన సూచించారు కూడా.మరోవైపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అశ్విని పొన్నప్ప ను చేర్చుకోవలంటూ లేఖ రాశారు. ఈ ఇద్దరు సీఎంలు జోక్యం చేసుకోవడంతో ప్రధాని కార్యాలయం సూచన మేరకు వీరిని ఒలింపిక్ పోడియంలో చేర్చుకున్నారు. మొత్తానికి హైలెవల్లో ఒత్తిడి చేయించి జ్వాల అనుకున్నది సాధించి గోపీచంద్ పై పోరాటంలో విజయం సాధించినట్లయింది.