Begin typing your search above and press return to search.

భారీ సంచలనం; మన సానియా వింబుల్డన్‌ విజేత

By:  Tupaki Desk   |   11 July 2015 10:30 PM GMT
భారీ సంచలనం; మన సానియా వింబుల్డన్‌ విజేత
X
వింబుల్డన్‌లో ఎంట్రీ దొరకటమే గొప్పగా భావించటం మొదలు.. క్వార్టర్స్‌ వరకూ వస్తే ఊరు..వాడా ఏకం అయి.. మా గొప్పగా చెప్పుకునే పరిస్థితి. అలాంటి వింబుల్డన్‌ ట్రోఫీని భారత్‌ ఆటగాడు సొంతం చేసుకోవటం అన్నది కలా.. నిజమా అనిపించక మానదు.

సింగిల్స్‌లో అలాంటి అద్భుతం జరగనప్పటికీ.. డబుల్స్‌లో ఆ కలను తీర్చింది హైదరాబాదీ సానియామీర్జా. వింబుల్డన్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో టెన్నిస్‌ మాజీ నెంబర్‌వన్‌ మార్టినా హింగిస్‌తో జత కట్టి వింబుల్డన్‌ విజేతగా అవతరించింది.

మహిళల డబుల్స్‌ విభాగంలో మకరోవా జోడీపై సానియా జోడీ 5-7.. 7-6.. 7-5 తేడాతో విజయం సాధించింది. అంతర్జాతీయ టెన్నిస్‌ పోటీల్లో గత పన్నెండేళ్లుగా పాల్గంటున్న సానియామీర్జా తాజాగా వింబుల్డన్‌ట్రోఫీని గెలిచి సంచలనం సృష్టించింది. ఒక భారతీయురాలు వింబుల్డన్‌ విజేతగా నిలవటానికి మించిన గర్వకారణం ఏముంది? అందులోకి.. మన హైదరాబాదీ ఈ విజయాన్ని సొంతం చేసుకోవటంతో హైదరాబాదీయుల ఆనందానికి పట్టపగ్గాల్లేని పరిస్థితి.

ఇక.. విజేతగా నిలిచిన సానియాకు రూ.3.34కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. మొత్తంగా వింబుల్డన్‌ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో విజయం సాధించటంతో సానియామీర్జా సత్తా ఏంటో మరోసారి తెలిసిన పరిస్థితి.