Begin typing your search above and press return to search.

రవీంద్ర జడేజా.. సెలక్టర్లకు థ్యాంక్స్

By:  Tupaki Desk   |   24 July 2015 6:58 AM GMT
రవీంద్ర జడేజా..  సెలక్టర్లకు థ్యాంక్స్
X
120 కోట్లమంది జనాభా ఉన్న దేశం మనది. టీమ్ ఇండియా తరఫున క్రికెట్ మ్యాచ్ ఆడాలని కొన్ని కోట్ల మంది యువ ఆటగాళ్లు ఆశగా ఎదురు చూస్తుంటారు. అందులో భారత్ కు ఆడే సామర్థ్యం ఉన్నవాళ్లు కూడా లక్షల్లోనే ఉంటారు. అంతమందిలోంచి భారత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకోవడానికి అదృష్టంతో పాటు అపారమైన ప్రతిభ ఉండాలి. ఎంపికైన ఆటగాడి ప్రదర్శన చూసి.. ఆ స్థానానికి అతడే వంద శాతం కరెక్ట్ అనిపించాలి. అలా అనిపించని పక్షంలో ఆ ఆటగాడిని తప్పించడానికి ఎక్కువ కాలం నిరీక్షించకూడదు. కానీ ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకున్న రవీంద్ర జడేజా ఎన్నడూ తన పాత్రకు న్యాయం చేయకున్నా ఏళ్ల తరబడి జట్టులో కొనసాగాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అత్యంత ఆప్తుడిగా పేరుబడ్డ జడేజా.. అతడి చలవతోనే ఇన్నాళ్లు జట్టులో కొనసాగగలిగాడన్నది వాస్తవం.

ధోని గొప్ప కెప్టెన్ కావచ్చు. భారత్ కు ఎన్నో అద్భుత విజయాలందించి ఉండవచ్చు. ఎందరో కుర్రాళ్లను తీర్చిదిద్ది ఉండొచ్చు. కానీ సరిగా ఆడని జడేజాను వెనకేసుకురావడంలో మాత్రం అతడి ఉద్దేశాల్ని తప్పుబట్టాల్సిందే. వన్డేలకే పనికి రాడనుకున్న జడేజాను టెస్టుల్లో కూడా కొనసాగించడం ఎంత వరకు సమంజసమో అతడే చెప్పాలి. ఐతే ధోని టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం ఆలస్యం.. జడేజాపై టెస్టుల్లో వేటు పడిపోయింది. ఇక బంగ్లాదేశ్ చేతిలో సిరీస్ ఓటమి తర్వాత వన్డే కెప్టెన్ గానూ పట్టు కోల్పోయిన పరిస్థితుల్లో పరిమిత ఓవర్ల క్రికెట్ వేటు నుంచి కూడా తన ఆప్త మిత్రుడిని కాపాడుకోలేకపోయాడు ధోని. జింబాబ్వే పర్యటనకు గానీ, తాజాగా శ్రీలంక పర్యటనకు గానీ జడేజా ఎంపిక కాకపోవడాన్ని బట్టి సెలక్టర్లు ఇక ఏమాత్రం జడేజాను ఉపేక్షించేది లేదని.. అతడి విషయంలో ధోని మాటకు విలువ ఇచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ఇప్పుడిప్పుడే భారత జట్టులోకి మళ్లీ వచ్చే పరిస్థితి లేదని తేలిపోవడంతో చాన్నాళ్లుగా పెండింగులో ఉండిపోయిన మొక్కుల్ని తీర్చుకుంటున్నాడు జడేజా. మంతనో మాధ్ అనే ప్రాంతానికి 350 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలన్నది అతడి చాన్నాళ్ల కోరిక. పాపం భారత జట్టుకు ఆడుతూ ఆడుతూ తీరికే లేకుండా పోయింది. ఎన్నో ఏళ్ల కోరిక తీర్చుకోవడానికి ఇన్నాళ్లకు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. దీంతో ఈ నెల 18న యాత్ర మొదలుపెట్టాడు జడ్డూ. తనకీ అవకాశం కల్పించినందుకు భారత సెలక్టర్లకు జడేజా థ్యాంక్స్ చెప్పాల్సిందే.