Begin typing your search above and press return to search.

'ఎవ‌డు' మ‌ర్డ‌ర్ ఎపిసోడ్‌ లో మ‌రిన్ని నిజాలు

By:  Tupaki Desk   |   13 Dec 2017 5:03 AM GMT
ఎవ‌డు మ‌ర్డ‌ర్ ఎపిసోడ్‌ లో మ‌రిన్ని నిజాలు
X
వివాహేత‌ర సంబంధం మీద మోజుతో ప్రేమించి పెళ్లాడిన భ‌ర్త‌ను అమానుషంగా చంప‌ట‌మే కాదు.. ప్రియుడ్ని భ‌ర్త స్థానంలో ఉంచి నాట‌కం ఆడిన "ఎవ‌డు" మ‌ర్డ‌ర్ కేసుకు సంబంధించి మ‌రిన్ని షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాజేశ్ తో త‌న‌కున్న అక్ర‌మ సంబందం గురించి భ‌ర్త‌కు తెలిసిన నేప‌థ్యంలో అత‌డ్ని చంపాల‌న్న ప్లాన్ వేసుకున్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌ను మ‌ట్టుబెట్టే రోజు త‌ర్వాతి రోజే కొడుకు ద‌ర్శిత్ రెడ్డి బ‌ర్త్ డే. అయిన‌ప్ప‌టికీ భ‌ర్త మ‌ర‌ణ‌శాస‌నం రాసేసిన స్వాతి వైనంపై ఇప్పుడు విస్మ‌యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

న‌వంబ‌రు 27న ప్రియుడితో క‌లిసి భ‌ర్త‌ను హ‌త‌మార్చిన స్వాతి.. భ‌ర్త స్థానంలో ప్రియుడ్ని తెచ్చేందుకు భారీ ప్లాన్ వేయ‌టం తెలిసిందే. యాసిడ్ దాడి జ‌రిగింద‌న్న పేరుతో భ‌ర్త స్థానంలో ప్రియుడ్ని తెచ్చేందుకు వీలుగా ప‌క్కా ప్లాన్ ఒక‌టి వేసుకున్నారు. ముఖానికి క్రీం రాసుకొని.. పెద్దాల‌కు ప్లాస్ట‌ర్ వేసుకొని.. ముఖం నిండా గుడ్డ క‌ట్టుకొని.. దాని మీద పెట్రోల్ తో నిప్పు అంటించుకున్నాడు.

దీంతో ముఖం న‌ల్ల‌గా క‌ప్పెట్టిపోయి గాయ‌మైందే త‌ప్ప ప్లాస్టిక్ స‌ర్జ‌రీ అవ‌స‌రం లేని ప‌రిస్థితి.అయితే.. ఆసుప‌త్రిలో ఉన్న కొడుకును చూసేందుకు వ‌చ్చిన సుధాక‌ర్ రెడ్డి త‌ల్లిదండ్రుల‌కు అనుమానం క‌ల‌గ‌కుండా ఉండేందుకు వీలుగా గ‌దిలో వెలుతురు త‌క్కువ ఉండేలా చూడ‌టం.. మాట్లాడితే త‌న ఉనికి బ‌య‌ట‌ప‌డుతుంద‌న్న ఉద్దేశంతో నిద్ర పోతున్న‌ట్లు న‌టించేవాడు.

న‌ర్సులు ప‌క్క‌న నిల‌బ‌డితే బ‌య‌ట‌కు వెళ్ల‌మ‌ని కోప్ప‌డేవాడ‌ని.. త‌న కొడుక్కి ఛాతీ మీద వెంట్రుక‌లు త‌క్కువ‌గా ఉండేవ‌ని.. కాలిగోళ్లు చీలిన‌ట్లుగా ఉంటాయ‌ని.. అందుకు భిన్నంగా ఉండ‌టంతో సుధాక‌ర్ రెడ్డి త‌ల్లిదండ్రుల‌కు సందేహం వ‌చ్చింది. దీనికి తోడు.. మ‌ట‌న్ సూప్ ఇస్తే తాగ‌న‌ని నిరాకరించేవాడు. రాజేశ్ వెజిటేరియ‌న్ కావ‌టంతో మ‌ట‌న్ సూప్‌కి నో చెప్పేశాడు. దీంతో సుధాక‌ర్ రెడ్డి త‌ల్లిదండ్రుల‌కు అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పుణెకు వెళ్లిపోవాల‌ని స్వాతి.. రాజేశ్ లు ప్లాన్ చేసుకున్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రాజేష్ ఆధార్ కార్డులోని వేలిముద్ర‌లు.. చికిత్స‌పొందుతున్న రాజేశ్ వేలిముద్ర‌లు స‌రిపోక‌పోవ‌టంతో సుధాక‌ర్ రెడ్డి ఏమ‌య్యాడంటూ పోలీసులు స్వాతిని విచారించారు. దీంతో.. అస‌లు విష‌య‌మంతా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

త‌మ గుట్టు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు స్వాతి.. రాజేశ్ లు ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లుగా పోలీసుల విచార‌ణ‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఫోన్ కాల్స్ చేసుకుంటూ త‌మ కాల్ డేటా బ‌య‌ట‌కు వ‌స్తుంద‌న్న ఉద్దేశంతో వాట్సాప్ నే వినియోగించుకునే వారు. కాల్స్ మాట్లాడుకునే వారే కాద‌ని చెబుతున్నారు.

స్వాతి అత్యాశ‌.. వివాహేత‌ర సంబంధం కార‌ణంగా ఇప్పుడు ఇద్ద‌రు పిల్ల‌ల ప‌రిస్థితి అటూఇటూ కానిదిగా మారింది. ఇదిలా ఉంటే.. త‌న కూతురు చేసిన ప‌నికి స్వాతి తండ్రి తీవ్ర ఆవేద‌న‌కు గురి అవుతున్నారు. ముఖం కాలిని ఉదంతంలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ది త‌న అల్లుడు సుధాక‌ర్ రెడ్డి అని రూ.5ల‌క్ష‌లు బిల్లు క‌ట్టిన‌ట్లుగా స్వాతి తండ్రి ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. డ‌బ్బులు పోతే పోయాయ‌ని.. కానీ త‌న కూతురు స్వాతి ఇంత మోసం చేస్తుంద‌ని తాను అనుకోలేద‌ని వాపోయారు. స్వాతి పిల్ల‌ల బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పిన ఆయ‌న‌.. స్వాతి కూడా చ‌చ్చింద‌ని తన‌కు తానే కార్మ‌కాండ‌లు చేసుకోవ‌టంతో పాటు గుండు గీయించుకున్న‌ట్లుగా ఆయ‌న వాపోయారు. ఇలాంటి శోకం ఏ త‌ల్లిదండ్రుల‌కు క‌ల‌గ‌కూడ‌ద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. అక్ర‌మ సంబంధంతో ఆనందం సంగ‌తి తర్వాత ఇలాంటి దారుణ ప‌రిస్థితులు ఎదుర‌వుతాయ‌న్న‌ద మ‌ర్చిపోకూడ‌దు.